ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం - కరవును కప్పెట్టేలా గణాంకాలు?

YSRCP Government Negligence on Drought Mandals: అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ అనేక గ్రామాలు, మండలాల్లో వర్షాభావంతో పంటలు ఎండిపోతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొద్దిపాటి కరవే ఉందంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను నిజం చేసేందుకు రాష్ట్ర భవిష్యత్తును సైతం పణంగా పెడుతున్నారు. కరవును దాచిపెట్టేలా గణాంకాలను రూపొందిస్తున్నారు. వానల్లేక, సాగు తగ్గి రాయలసీమ నుంచి ప్రజలు భారీగా వలసలు పోతుంటే ఇప్పటివరకూ 103 కరవు మండలాలను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 10:24 AM IST

Updated : Nov 17, 2023, 1:13 PM IST

YSRCP_Government_Negligence_on_Drought_Mandals
YSRCP_Government_Negligence_on_Drought_Mandals

YSRCP Government Negligence on Drought Mandals :రాష్ట్రంలో రైతులు వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవ గణాంకాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఖరీఫ్‌లో కరవు మండలాలు 400 పైనే ఉంటాయి. అధికారులు మాత్రం 103 కరవు మండలాల్నే ప్రకటించి సరిపెట్టారు. కరవును గుర్తించే అన్ని అంశాల ప్రకారం చూసినా దుర్భిక్ష పరిస్థితులున్నాయి. అయినా సీఎం జగన్ మాటలకు అనుగుణంగా కొద్దిపాటి కరవునే చూపాలంటే గణాంకాల్లో తిరకాసు చేయక తప్పదు. అలాచేస్తే ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే అవుతుందనే అభిప్రాయాలు వ్యవసాయ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఖరీఫ్‌ ముగిసి నెలన్నర దాటినా ఇప్పటికీ కరవు లెక్కలు బయట పెట్టలేదు. కేంద్రానికి నివేదికల్ని పంపలేదు.


Drought Zones in AP :ప్రభుత్వాలెన్నో మారాయి. ఎప్పుడూ వాస్తవ గణాంకాల ఆధారంగానే కరవు మండలాల్ని ప్రకటిస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోదు. అయితే సీఎం స్థాయి వ్యక్తే కరవు గురించి పట్టించుకోక పోవడాన్ని, అధికారులు తమ బాధ్యతను విస్మరించి పని చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. 2021-22, 2022-23లోనూ కరవు పరిస్థితులున్నా కావాలనే దాటవేశారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా?

YCP Govt Manipulations on Drought Hit Mandals :వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయాలంటే.. కొన్ని దశాబ్దాల వర్షపాతం, ఉష్ణోగ్రతలు, సాగు, కరవు తీవ్రత తదితరాల్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అత్యధిక, అత్యల్ప వర్షపాతం, ఉష్ణోగ్రతలు తెలియాలంటే పాత రికార్డులే ఆధారం. అలాంటి వాటిని ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేస్తే ప్రజలకు తీరని ద్రోహం చేసిన వారవుతారు. ఆ సంగతిని అధికారులు గుర్తెరగాలి అని నిపుణులు విమర్శిస్తున్నారు. ఖరీఫ్‌ ఆరంభం నుంచే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో సాధారణం కంటే 31.5%తక్కువవర్షపాతం నమోదైంది. ఆగస్టులో 55% తక్కువ వానలు కురిశాయి. గత 50 ఏళ్లలో ఇంతటి తీవ్ర వర్షాభావం లేదు.

వాస్తవాలకు పాతర.. అబద్ధాల జాతర :70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్టోబరులో 90% తక్కువ వానలు కురిశాయి. సుమారు 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు. ఇవన్నీ వాస్తవాలే అయినా అధికారులు ఎక్కడా నోరు మెదపడం లేదు. సాగు తగ్గిందంటే వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఉలిక్కిపడుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ పెద్దల నుంచి ఆగ్రహం ఎదురవుతుందో అనే భయంతో అంతా బాగుందంటూ ప్రకటనలు ఇస్తున్నాయి.

రాష్ట్రంలో కరవు తాండవం.. ప్రభుత్వం మౌన ముద్ర : ఆగస్టు 1 నుంచి 31 వరకు పరిశీలిస్తే ఒక్క మండలంలోనూ వర్షం లేదు. 361 మండలాల్లో దుర్భిక్ష ఛాయలు నెలకొన్నాయి. 229 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు 42 మండలాల్లో దుర్భిక్షం, 376 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సాధారణ విస్తీర్ణం 120 లక్షల ఎకరాలుంటే 71.32 లక్షల ఎకరాలు అంటే 60% విస్తీర్ణంలోనే.. పంటలు వేశారు. కరవుతో అల్లాడిపోతున్నామని రైతులు చెబుతున్నా జగన్‌ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది.

ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు కరవు విలయతాండవం: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు
Drought Mandals in AP 2023 :వర్షపాతం,సాగు,పంటల పరిస్థితి, రిమోట్‌ సెన్సింగ్, నేలలో తేమ, నీటివసతి, క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా కరవును అంచనా వేస్తారు. ఇందులో వర్షపాత గణాంకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటారు. వాటి ప్రకారం జూన్‌లో 31.5 శాతం, ఆగస్టులో 55 శాతం తక్కువ వానలు కురిశాయని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలూ ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగానే నమోదయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది.

రాయలసీమలో వలసల పరంపర :కరవు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన సామాజిక, ఆర్థిక సూచీలూ ఉన్నాయి. వాటి ప్రకారం చూసినా సాగు 30% పైగా తగ్గిపోయింది. కూలీలకు పనుల్లేవు. కూలి రేట్లు తగ్గాయి. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలస పోతున్న పరిస్థితులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచే 50 వేల కుటుంబాలకుపైగా వలస బాట పట్టాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం :ఆహార ధాన్యాల సాగు తగ్గింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయినా అధికారులు ఎక్కడా రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కరవు పరిస్థితులకు అనుగుణంగా ఉపశమన చర్యలు చేపడుతుంది. వైసీపీ హయాంలో అలాంటి చర్యలే కొరవడ్డాయి. కరవు తీవ్రంగా ఉందని అంగీకరించేందుకే వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు ఇష్టపడటం లేదు. కరవు వల్ల రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని విస్మరిస్తున్నారు.

సీఎం సొంత జిల్లాలో నీటి కొరత - కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై సీపీఐ ఎద్దేవా

Last Updated : Nov 17, 2023, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details