అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో దారుణ ఘటన జరిగింది. పంట పొలంలో పనిచేస్తున్న నందిని అనే యువతి దారుణ హత్యకు గురైంది. తలపై అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలొదిలింది.
భర్తే చంపాడా?
పాత గుంతకల్లుకు చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి అనే దంపతులకు కుమార్తె అయిన నందినిని గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన నాగార్జునకు ఇచ్చి 2011 సంవత్సరంలో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. వీరి దాంపత్య జీవితం పెళ్లయిన కొత్తలో సజావుగా సాగింది. అయితే ఇటీవల తరచూ భార్య నందినితో గొడవ పడుతున్నాడు నాగార్జున. పెద్దలు పంచాయతీ చేసినా నాగార్జునలో మార్పు రాలేదు. బుధవారం నందిని.. భర్త నాగార్జునతో కలిసి తమ పొలంలోని వేరుశనగ పంటలో కలుపు తీస్తున్నారు. కాసేపటికి తనకు ఇంటి వద్ద పని ఉందని భార్యకు చెప్పి పొలం వద్ద నుండి ఇంటికి వెళ్లిపోయాడు నాగార్జున. ఒంటరిగా ఉన్న నందిని హత్యకు గురైంది. ఈ క్రమంలో నాగార్జునపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.