అనంతపురం జిల్లాలోని తూర్పు మండలాలకు గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. గత దశాబ్ద కాలంగా అరకొర పనులు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు జిల్లాకు చేరుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న డిజైన్లలో సమూల మార్పులు చేశారు. గతంలో రెండు టన్నెళ్లను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. తాజాగా కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఎస్.ఉప్పరపల్లి నుంచి 12 కి.మీల మేరకు టన్నెల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. భూమికి 25 మీటర్ల అడుగున టన్నెల్ ఏర్పాటు చేయనున్నారు. టన్నెల్ ద్వారా వచ్చే నీటిని తుంబురకోనలోకి వదలనున్నారు. అక్కడి నుంచి మల్లెమడుగు జలాశయానికి తరలిస్తారు. ఈ కారణంగా.. అటవీ భూసేకరణకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు.
మల్లెమడుగుకు వచ్చే నీటిని కైలాసగిరి కాలువ ద్వారా కల్లూరు ప్రాంతం(12.80 కి.మీల మేరకు) వరకు నీటిని తీసుకెళ్లనున్నారు. కల్లూరు ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి పైప్లైన్ ద్వారా అప్పలాయగుంట వరకు తరలించనున్నారు. అక్కడి నుంచి తొలుత ప్రతిపాదించిన జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువకు నీటిని పంపింగ్ చేయనున్నారు. అక్కడి నుంచి తడుకు వరకు అసంపూర్తిగా ఉన్న జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు. ఇలా మొత్తం పనులు పూర్తి చేసేందుకు సుమారు రూ.4564.44 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటికి ఆమోదముద్ర లభిస్తే రానున్న రోజుల్లో పనులు పూర్తి చేసి జిల్లాలోని తూర్పు మండలాలకు తాగు, సాగు నీటి ఇబ్బందులు తీర్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.