ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలో సాగైన వేరుశెనగ, మొక్కజొన్న, మిరప, వరి, పత్తి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది. సింహభాగం వేరుశెనగకు తీవ్ర నష్టం కలిగింది. ఖరీఫ్ సీజన్లో సాగైన పంటలను ఓ వైపు చీడపీడలు, మరోవైపు వర్షాలు చుట్టుముట్టి రైతు కష్టాన్ని మట్టిపాలు చేశాయి. అప్పుల్ని మిగిల్చాయి.
భరోసా ఏదీ?
ఖరీఫ్లో సాగైన అన్ని పంటలు దెబ్బతిన్నాయి. రూ.వందల కోట్ల నష్టం జరిగింది. అయితే వ్యవసాయశాఖ అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించలేదు. నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోలేదు. తమ కష్టాలను పట్టించుకునేవారే లేరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాన ముంచింది..
పాత అప్పులు తీర్చుదామని, ఈసారి 9 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మిరప సాగు చేశా. ఎకరాకు 20 వేల చొప్పున యజమానికి కౌలు చెల్లించా. పెట్టుబడి కోసం ఎకరాకు రూ.18 వేలు ఖర్చు చేశా. భారీ వర్షాలతో పంటలో నీరు నిలిచింది. విల్ట్ తెగులు ఆశించి మిరప పంట పూర్తిగా ఎండిపోయింది. కొంత భాగం తొలగించి, జొన్న సాగు చేస్తున్నా. మళ్లీ వచ్చిన వానలతో జొన్న పంట కూడా కొంత దెబ్బతింది. చివరికి అప్పులే మిగిలాయి. - సుంకిరెడ్డి, పాల్తూరు, విడపనకల్లు