కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన తర్వాత కూడా.. జిల్లాల కోసం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు జిల్లా కేంద్రం ప్రకటించలేదంటూ పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రతులకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
హిందూపురం:హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హిందూపురంలో నల్లజెండాలతో అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని రకాలుగా అర్హతలు కలిగి ఉన్న హిందూపురాన్ని కాదని.. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించడం సరికాదన్నారు. సత్యసాయి జిల్లా గెజిట్ నోటిఫికేషన్ ప్రతులకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు.
మాచవరం:కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే.. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ మాచవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాచవరం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు చరిత్రతో సంబంధం లేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటంపై.. అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ను పట్టించుకోలేదని విమర్శించారు.