ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో రైతులను కంటతడి పెట్టిస్తోన్న భూ సేకరణ - Anantapur Farmers

పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం మొదలు పెట్టిన భూసేకరణ చిన్న, సన్నకారు రైతులను కంటతడి పెట్టిస్తోంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని రాచానుపల్లి గ్రామంలో గతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం 60 ఎకరాలు సేకరించారు. ఏడాది దాటినా అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అసలు భూమిని ఏ పరిశ్రమకు కేటాయించారో ఏపీఐఐసీ అధికారుల నుంచి స్పష్టత లేదు. ఇదిలా ఉండగానే మరో 12 మంది రైతులకు చెందిన 30 ఎకరాలు సేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భూమి కొలతలు చేస్తున్న తీరు అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తోంది.

Poor Farmers Suffering From APIIC Activities in Anantapur district
రైతులను కంటతడి పెట్టిస్తున్న భూ సేకరణ

By

Published : Feb 25, 2020, 7:49 PM IST

రైతులను కంటతడి పెట్టిస్తోన్న భూ సేకరణ

అనంతపురం జిల్లాలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి... ఏ సంస్థలు ముందుకు వస్తున్నాయనే స్పష్టత లేకుండానే ఏపీఐఐసీ అధికారులు రైతులను కంటితడి పెట్టిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాచానుపల్లి గ్రామంలో 742 సర్వే నెంబర్​లో 94 ఎకరాల భూమి ఉంది. దీనిలో కొంత అటవీ, మరికొంత ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్ భూమిలో ఎవరూ సాగు చేసుకోని 60 ఎకరాల విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు ఏడాది కిందటే కొలతలు వేసి పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించారు.

ఆ సంస్థ భూమిని చదును చేసి అంతర్గత రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తయ్యాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గజాల చొప్పున విక్రయిస్తారు. ఇప్పటికే 60 ఎకరాల భూమిని తీసుకున్న ఏపీఐఐసీ అధికారులు... దానిలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టలేదు. ఈ భూమిని ఎంతమంది పారిశ్రామిక వేత్తలకు విక్రయించారు..? వారు ఏ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు.

ఇప్పటికే సేకరించిన 60 ఎకరాల భూమిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయని ఏపీఐఐసీ అధికారులు... అదే సర్వే నెంబర్​లోని మరో 30 ఎకరాలు సేకరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన 60 ఎకరాల భూమి కొండలు, గుట్టల మయంగా ఉండి రైతులు ఎవరూ సాగుచేయటంలేదు. 4 దశాబ్దాల కిందట కొందరు పేద రైతులకు ప్రభుత్వం 37 ఎకరాల వరకు భూమి పంపిణీ చేసింది. కొండలు, గుట్టలతో నిండిన ఆ భూమిని పేద రైతులు ఏళ్ల తరబడి బాగు చేసుకుంటూ... సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు.

ఆ భూమిని ప్రస్తుతం పారిశ్రామిక వాడలో కలపాలని ఏపీఐఐసీ అధికారులు రెవెన్యూ అధికారులను కోరారు. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాప్తాడు రెవెన్యూ సిబ్బంది నేరుగా భూమి కొలతలు తీస్తుండగా అన్నదాతలు తిరగబడ్డారు. కష్టపడి సాగుయోగ్యంగా మార్చుకున్న భూమిని సేకరించాలని ప్రభుత్వం యత్నిస్తోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదు. పేద రైతుల భూములను బలవంతంగా సేకరించడానికి చేస్తున్న ప్రయత్నం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:

స్పందనలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: సీఎం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details