ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకేనాళ్లు ఈ ఉల్లి కష్టాలు...?? - onion problems at ananthapur news

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఏ కూర చేసినా ఉల్లి వాడకం తప్పనిసరిగా మారటంతో... పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఐదు టన్నుల ఉల్లిని కర్నూలు నుంచి తెప్పించి అనంతపురం రైతు బజార్​లో పంపిణీ చేస్తున్నారు. ఉల్లి ధర కిలో 170 రూపాయలకు చేరటంతో...అనంతపురం రైతు బజార్లలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు తెల్లవారక ముందే వరసల్లో బారులు తీరుతున్నారు.

onion problems at ananthapur district
అనంతపురం జిల్లాలో ఉల్లి కోసం బారులు తీరిన జనం

By

Published : Dec 10, 2019, 8:03 AM IST

అనంతపురం జిల్లాలో ఉల్లి కోసం బారులు తీరిన జనం

దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదలతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం రాయితీతో ఉల్లి పంపిణీ చేస్తున్నా...తమకు అందటం లేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం రైతు బజార్​లో పది రోజులుగా ఉల్లి పంపిణీ జరగుతుండగా...అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి వేలం ద్వారా కొనుగోలు చేసి కిలో రూ.25 చొప్పున, ప్రతి కుటుంబానికి రెండు కిలోలు పంపిణీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఉల్లి ధర అధికంగా ఉండటంతో రెండు కిలోల ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూలైన్లో నిరీక్షించటానికి కూడా వెనుకాడటంలేదు ప్రజలు.

తీవ్ర వర్షాలతో పంట నష్టం...
దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది. విదేశాలకు పెద్దఎత్తున ఉల్లిని ఎగుమతి చేసే మహారాష్ట్రలో కూడా... ప్రస్తుతం ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. గత ఏడాది ధరలు లేక గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన ఉల్లిని, మహారాష్ట్ర వ్యాపారులు నెమ్మదిగా మార్కెట్​లో విడుదల చేస్తూ, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలు అదుపు చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను సైతం వ్యాపారులు విఫలం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

రికార్డు స్థాయిలో ఉల్లి ధర...
కర్నూలు మార్కెట్​లో కిలో 17 రూపాయల చొప్పున రైతులకు దక్కుతోంది. కర్నూలు మార్కెట్ యార్డు నుంచి మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసి పొరుగు జిల్లాలకు తరలిస్తున్న ప్రభుత్వం ప్రజలకు కిలో 25 రూపాయల చొప్పున ఇస్తోంది. రాయితీ ఉల్లి పంపిణీకి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవటంతో ఉల్లి కోసం ప్రజలు పెద్దఎత్తున బారులు తీరి నిరీక్షించాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ఉల్లిని సాగుచేసే కర్నూలు జిల్లాలో ఈసారి రైతుల పంట పండినట్లైంది. శుక్రవారం గరిష్టంగా క్వింటా 17వేల రూపాయలకు రైతులు విక్రయించారు.

ప్రజల పాట్లు...
ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.170కు చేరటంతో ప్రజలు రాయితీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా కేంద్రంలో మాత్రమే రాయితీ ధరపై ఉల్లిని పంపిణీ చేస్తుండగా, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

ABOUT THE AUTHOR

...view details