ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2022, 8:57 AM IST

Updated : Dec 31, 2022, 9:26 AM IST

ETV Bharat / state

"అయ్యా నాకు 158 ఇళ్లు లేవు.. నా పింఛన్ తొలగించొద్దు"

PENSION : పూట గడవడమే కష్టంగా ఉన్న అనేక మంది నిర్భాగ్యులు పింఛన్ తోనే జీవనం సాగిస్తున్నారు. కాటికి కాళ్లుచాచిన వేలాది మంది వృద్ధులకూ అదే ఆసరా. కానీ చిన్నపాటి గది ఉన్న వారి ఇంటిని వెయ్యి చదరపు అడుగుల ఇల్లుగా రికార్డుల్లో మార్చి పింఛన్ తొలగింపు నోటీసు ఇచ్చారు. ఓ వృద్ధ మహిళకు ఏకంగా లక్ష 31 వేల చదరపు అడుగుల 158 ఇళ్లు ఉన్నాయని పింఛన్ తొలగింపు హెచ్చరిక చేశారు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో పింఛన్ తొలగించేందుకు..కారణాలు చూపిస్తూ, అధికారులు జారీ చేస్తున్న నోటీసులతో నిరుపేదలు షాక్ అవుతున్నారు.

CANCELLATION OF PENSIONS
CANCELLATION OF PENSIONS

CANCELLATION OF PENSIONS : ఉమ్మడి అనంతపురం జిల్లాలో సామాజిక పింఛన్ల తొలగింపు నోటీసులు అందుకున్న వారంతా కన్నీరు మున్నీరవుతున్నరు. పింఛన్ తొలగించి కడుపుమీద కొడతున్నారంటూ నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పెనుకొండ మండలం ఇస్లాపురంలో రజకవృత్తి చేస్తున్న నిరుపేద రామక్కకు భర్త చనిపోవటంతో 13 ఏళ్లుగా వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఈమెకు లక్ష 31 చదరపు అడుగుల్లో ఇల్లు ఉందని.. పింఛన్ తొలగిస్తామని నోటీసు ఇచ్చారు. ఇస్లాపురం గ్రామంలోని 158 ఇళ్లన్నీ రామక్క ఆధార్ నెంబర్​కు అనుసంధానం చేసిన అధికారులు పింఛన్​కు అనర్హురాలిగా నోటీసు ఇచ్చారు. అలాగే వృద్ధుడు నారాయణప్పకి వెయ్యి అడుగుల ఇల్లు ఉందని నోటీసు ఇచ్చారు.

"మాకు పింఛన్లు లేకుండా చేశారు. 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులు ఇచ్చారు. కేవలం ఇందిరమ్మ ఇళ్ల కింద ఇచ్చిన ఒకటిన్నర సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టకున్నాం. దయచేసి నాకు పింఛన్​ ఇప్పించండి"-రామక్క, బాధితురాలు

హిందూపురంలో దివ్యాంగురాలైన విద్యార్థి స్పందనది అత్యంత దయనీయ పరిస్థితి. పుట్టుకతో దివ్యాంగురాలు కావటంతో సామాజిక పింఛన్ తీసుకుంటోంది. అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిగా ఉన్న 1100 చదరపు అడుగుల ఇంటిలో స్పందన తండ్రిది కేవలం 310 గజాలు మాత్రమే. కాని అధికారులు మాత్రం వెయ్యి చదరపు ఇల్లు ఉందని పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. ఈ తండ్రీ, కుమార్తె ఆవేదన ఎంత చెప్పినా తక్కువే.

"నాకు పుట్టిన అప్పటి నుంచి వికలాంగులు పింఛన్​ వస్తుంది. కానీ ఇప్పుడు ఇదీ కూడా తీసేశారు. అమ్మఒడి కూడా రావట్లేదు. మాకు చిన్న ఇళ్లు మాత్రమే ఉంది. దయచేసి నాకు పింఛన్​ ఇప్పించండి"-స్పందన, దివ్యాంగురాలు

కదిరిలో నిరుపేద కుటుంబానికి చెందిన బీబీజాన్ పుట్టకతో దివ్యాంగురాలు. 2009 నుంచి దివ్యాంగుల పింఛన్ తీసుకుంటున్న ఈ దీనురాలికి అధికారులు వెయ్యి చదరపు అడుగుల ఇల్లు సృష్టించారు. నారాయణమ్మది మరో దీనగాధ. గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఈ మహిళ .. ఒంటరిగా చిన్న గదిలో జీవనం చేస్తూ పింఛన్ డబ్బుతోనే బతుకున్నారు. ఈమెకు వెయ్యి చదరపు అడుగుల ఇల్లు ఉందని పింఛన్ తొలగింపు నోటీసు ఇచ్చారు.

పుట్టపర్తి పట్టణంలో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న మదార్ సాబ్ కు అధికారులు పింఛన్ తొలగింపు నోటీసు ఇచ్చారు. నిరుపేద యల్లప్పకి వెయ్యి అడుగుల కంటే పెద్ద ఇల్లు ఉందని పింఛన్ తొలగింపు నోటీసు ఇచ్చారు. అనంత నగరానికి చెందిన లక్ష్మమ్మ, యశోదమ్మలకు పింఛన్ తొలగింపు నోటీసులు ఇచ్చారు. లక్ష్మమ్మకు 45 వేల రూపాయల నెలవారీ విద్యుత్ బిల్లు వచ్చిందని... యశోదమ్మకు విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందని పింఛన్ తొలగించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాల వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 18 వేల మందికి పింఛన్ తొలగింపు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో 30 వేల మందికి హెచ్చరిక నోటీసులు చేరినట్లు సమాచారం.

"అయ్యా నాకు 158 ఇళ్లు లేవు.. నా పింఛన్ తొలగించొద్దు"

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2022, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details