ఈసారి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ రైతులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏటా సీజన్ ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు పుష్కలంగా వర్షాలనివ్వటం, అనంతరం పంట కీలక సమయంలో వర్షాభావం తలెత్తటం జరుగుతోంది. వాతావరణానికి ఎదురొడ్డి పంట దక్కించుకుంటే చివరిదశలో ఉన్న పంటను కుండపోత వానలు ముంచేయటం జరుగుతోంది.
ఈసారి ఖరీఫ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. గత నెల ఆరో తేదీవరకు మంచి వర్షాలు నమోదుకాగా తొలివారం తర్వాత వానలకు విరామం వచ్చింది. దీంతో రైతులు ఎక్కడా విత్తనం వేయలేకపోయారు. గత ఏడాది జూలై 10 నాటికి 1.36 లక్షల హెక్టార్లలో రైతులు విత్తనం వేయగా.. ఈసారి అదే తేదీ నాటికి కేవలం 67 వేల 160 హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారు.
జిల్లాలో 63 మండలాలుండగా, 53 మండలాల్లో సాధారణాన్ని మించి వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో జిల్లావ్యాప్తంగా 63 శాతం సాధారణం మించిన వర్షపాతం నమోదుకాగా, ఈనెల 12వ తేదీనాటికి 97 శాతం ఎక్కువగా వర్షపాతం వచ్చిందని.. అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలోని 4 మండలాల్లో లోటు వర్షపాతం నమోదుకాగా, బొమ్మన హాల్ మండలంలో చినుకు రాలలేదు.