ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోరంట్ల.. అందేదెవరికంట..!

పంచాయతీ ఎన్నికల నగారా మోగటంతో... అనంతపురం జిల్లా గోరంట్ల మేజర్ పంచాయతీలో రాజకీయం రసవత్తరంగా మారింది. మెుదటిసారిగా ఎస్టీ మహిళకు సర్పంచి స్థానం రిజర్వు కావటంతో... అభ్యర్థి ఎంపికలో అన్ని పార్టీల నాయకులు కసరత్తు ప్రారంభించారు.

By

Published : Jan 30, 2021, 3:30 PM IST

gorantla
గోరంట్ల

అనంతపురం జిల్లాలో అయిదు దశాబ్దాల పాటు నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లిన గోరంట్ల మేజర్‌ పంచాయతీ జిల్లాలోని పెద్దమండలాల్లో ఒకటి. పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, పాలసముద్రం సమీపంలో కేంద్రప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో గోరంట్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటిసారి ఎస్టీ మహిళకు సర్పంచి స్థానం రిజర్వు కావడంతో ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. మండలం పెద్దది అయినప్పటికీ మూడో వంతు జనాభా, అదే స్థాయిలో ఓటర్లు గోరంట్ల పంచాయతీలోనే ఉండటంతో రెండు పార్టీల నాయకులు గోరంట్లలో పాగా వేయాలనుకుంటున్నారు. జనాభా 24,617 మంది. ఓటర్ల సంఖ్య 19,615. అధికారిక లెక్కల ప్రకారం ఆరువేల కుటుంబాలున్నాయి. మరో వెయ్యి వరకు రికార్డులోకి నమోదు కావాల్సి ఉంది.

పేరు గొప్ఫ. ఊరు దిబ్బ!

అభివృద్ధిలో దూసుకుపోతున్న గోరంట్లలో ఏళ్ల తరబడిగా తిష్ట వేసుకున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా తాగు నీటిసమస్య వేధిస్తోంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌ నియంత్రణ లేకపోవడం తలనొప్పిగా మారింది. గుమ్మయ్యగారిపల్లి నుంచి తిప్పరాజుపల్లి వరకు ఏర్పడిన గుంతలు వాహన చోదకులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేలసంఖ్యలో వాహనాలు తిరిగే మార్గం కావడంతో దుమ్ముతో స్థానికులు అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. పాత, కొత్త గోరంట్లకు వారధిగా ఉన్న చిత్రావతి నదిపై నూతన వంతెన నిర్మాణం నత్తతో పోటీపడుతోంది. మూడేళ్ల కిందట శంకుస్థాపన జరిగినా నేటికీ పూర్తికాలేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.

ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడే వ్యక్తులను పోలీసులు గుర్తించి స్టేషన్‌కు పిలిపించి బైండోవర్‌ చేస్తుంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకొని తహసీల్దార్‌ ఎదుట ప్రవేశపెడతారు. క్రిమినల్‌ ప్రోసిజర్‌ కోడ్‌ 107, 108, 109, 110సెక్షన్ల కింద బైండోవర్‌ చేస్తారు. గతంలో చేసిన పొరపాటును మళ్లీ చేయబోమని మండల మేజిస్ట్రేట్‌ ఎదుట ఒప్పుకున్న తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. చట్టవ్యతిరేక చర్యలు చేపట్టనని బాండ్‌ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. బైండోవర్‌ చేసిన వ్యక్తిపై అనుమానం వస్తే పోలీసులు 24 గంటల వరకు అదుపులో ఉంచుకోవచ్ఛు.

కొడిగెనహళ్లిపై అందరి చూపు

మండలంలోని కొడిగెనహళ్లి మేజర్‌ పంచాయతీ హిందూపురం పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉంటోంది. పంచాయతీపై పట్టు సాధించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. పంచాయతీ జనాభా 13,017 మంది. ఓటర్లు 8,650 మంది ఉన్నారు. పంచాయతీకి పన్నుల రూపేణా సంవత్సరానికి రూ.5 లక్షలు, ప్రీకాటు బి స్పిన్పింగ్‌ మిల్లు, కాలువపల్లి గార్మెంట్‌ పరిశ్రమల ద్వారా మరో రూ.6 లక్షలు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే అధికం. ఎస్సీ వర్గీయులు, దేవాంగ, బోయ కమ్యూనిటీ, రెడ్డి కులస్తులు తర్వాతి స్థానాల్లో ఉంటారు. ఈసారి కొడిగెనహళ్లి సర్పంచి స్థానం ఈసారి ఎస్సీలకు రిజర్వు అయింది.

అభివృద్ధికి పాటుపడే వ్యక్తినే ఎన్నుకుంటాం

పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం ఉన్న వ్యక్తినే సర్పంచిగా ఎన్నుకుంటాం. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా అభిమతం. - నరసింహులు, బీసీ కాలనీ

తండాల తొలి అడుగు

బసినేపల్లి తండా

అదో గిరిజన గ్రామం. ఆ పల్లెలో 180 గడపలు ఉన్నాయి. 450 మంది ఓటర్లు, 646 మంది జనాభా ఉన్నారు. ఇప్పటివరకు రిజర్వేషన్ల వల్ల రెండు పర్యాయాలు బసినేపల్లి పంచాయతీకి సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైనా బలమైన సామాజిక వర్గం కనుసన్నల్లో కొనసాగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం గుత్తి మండలంలోని బసినేపల్లి తండాను బసినేపల్లి పంచాయతీ నుంచి వేరుచేసి ప్రత్యేక పంచాయతీగా చేసింది. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. కొత్త పంచాయతీగా ఏర్పాటు కావడంతో తొలి ఎన్నికలకు గిరిపుత్రులు ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కటిగా ఉన్న పల్లెలో ఇప్పుడు రెండు వర్గాలయ్యాయి. అందరూ గ్రామ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించారు. తొలి సర్పంచి ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది.

పీటీఆర్‌ పల్లి తండా

కళ్యాణదుర్గం మండలంలోని పీటీఆర్‌ పల్లి తండాను పంచాయతీగా ఏర్పాటు చేసినట్లు 2019 ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక్కడ మొదటిసారిగా సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ గ్రామం ముద్దినాయనపల్లి పంచాయతీ పరిధిలో ఉండేవి. జిల్లాలో 500 జనాభా కలిగిన 26 కొత్త పంచాయతీలు ఇటీవల ఏర్పడ్డాయి. దీనిలో భాగంగానే ఎగువతండా, దిగువతండాను కలిపి పీటీఆర్‌ పల్లి తండాను పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లో 190 కుటుంబాలు, 578 జనాభా, 293 మంది పురుషులు, 285 మంది మహిళలు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 186, మహిళా ఓటర్లు 194 మంది ఉన్నారు. కొత్త పంచాయతీలో మొదటి సర్పంచిగా ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొత్త పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

'ఎన్నికల్లో అలజడి సృష్టిస్తే చర్యలు తప్పవు'

ABOUT THE AUTHOR

...view details