ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంటల బీమా పరిహారంలో అవకతవకలు.. లోకాయుక్తను ఆశ్రయించిన రైతులు

By

Published : Jan 31, 2023, 5:32 PM IST

Anathapuram farmer turned to Lokayukta: ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన తమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పంటల బీమా పరిహారం విషయంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవటం లేదంటూ.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్ గ్రామానికి చెందిన రైతు రాంబాబు లోకాయుక్తను ఆశ్రయించారు.

anathapuram farmer
.లోకాయుక్తను ఆశ్రయించిన రైతు

పంటల బీమా పరిహారంపై లోకాయుక్తను ఆశ్రయించిన రైతులు

Anathapuram farmer turned to Lokayukta: పంటల బీమా పరిహారం అందించటంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఓ రైతు లోకాయుక్తను ఆశ్రయించటంతో వ్యవసాయశాఖ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నట్లుగానే.. బీమా పరిహారం అందని అర్హులైన రైతులు సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందించకపోవటంతో రాంబాబు అనే రైతు.. తన తల్లి పంట నష్టపోతే పరిహారం ఇవ్వలేదని, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి అవకతవకలకు పాల్పడ్డారని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ చేసి, నివేదికను సమర్పించాలని లోకాయుక్త.. వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. లోకాయుక్త ఆదేశాల మేరకు అప్రమత్తమైన అధికారులు పరుగులు తీస్తూ విచారణ చేపట్టారు.

పంట వేయని కొందరికి పరిహారం ఇవ్వటం, భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేసి.. కొన్ని ఏళ్లుగా బీడు పెట్టిన వ్యాపారుల ఖాతాలకు లక్షల రూపాయల పరిహారం ఇవ్వటం వంటి విచిత్రాలు అనేకం జరిగాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతుల పేర్లు జాబితాలో లేకుండా చేసి, రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. పంట నష్ట పరిహారం రాలేదని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోని అధికారులకు.. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్ గ్రామానికి చెందిన రైతు రాంబాబు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో అర్హులైన రైతుల పేర్లను పంట నష్ట పరిహారం జాబితా నుంచి తొలగించిన తీరుపై సాక్ష్యాధారాలు సేకరించిన రాంబాబు.. ఇటీవలే లోకాయుక్తను ఆశ్రయించారు. తన తల్లి లక్ష్మి పంట పెట్టి ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయినప్పటికీ పరిహారం ఇవ్వలేదని రాంబాబు పేర్కొన్నారు.

డోనేకల్లు గ్రామంలో పంట నష్ట పరిహారం తీసుకున్న రైతు జాబితాను రైతు భరోసా కేంద్రం నుంచి తీసుకున్న రాంబాబు.. అందులో పేర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ అక్రమాల నివేదికను తయారు చేశారు. గ్రామంలో దాదాపు 80 మంది అర్హులైన రైతులు పంటను కోల్పోయి.. అప్పులు పాలుకాగా, రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయశాఖ అధికారులు అర్హులైన రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు గ్రామంలో బాధిత రైతులు తెలిపారు. లోకాయుక్త ఆదేశాలతో అమరావతి వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన సంయుక్త సంచాలకులు కృపాదాస్ గోప్యంగా విచారణ చేస్తున్నారు. మీడియాకు సమాచారం ఇవ్వరాదని అనంతపురం జిల్లా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించిన ఆయన.. ఇప్పటికే రెండు విడతలుగా విచారణ చేశారు. మరోవైపు రైతుల ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న లోకాయుక్త లోతుగా విచారణ చేయిస్తున్నట్లు సమాచారం. ఏ పంట వేయకుండా భూములు బీడు పెట్టిన వారికి లక్షల రూపాయల పరిహారం బ్యాంకు ఖాతాలకు జమ చేశారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

బీమా పరిహార జాబితాలో పేరు రాలేదని, పేరున్నా పరిహారం అందలేదని నెలల తరబడి రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది రైతులు జిల్లా కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేసినా వ్యవసాయ శాఖ అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవటంతో అధికారుల చుట్టూ తిరగలేక నిస్సహాయులుగా వదిలేశారు. మరి లోకాయుక్త తీర్పు ఎలా ఉండనుందోనని అనంతపురం జిల్లావ్యాప్తంగా బాధిత రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న పంట బీమా పరిహారం విషయంలో మా గ్రామంలో అర్హులైన చాలా మంది రైతులకు పెద్దఎత్తున అన్యాయం జరిగింది. మాకు జరిగిన అన్యాయాలపై సాక్ష్యాధారాలతో లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేశాము. దాంతో వ్యవసాయశాఖ కమిషనర్ వారికి లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. గోప్యంగా విచారణ జరిపి ఒక నివేదికను సమర్పించమన్నారు. తాజాగా గ్రామంలోకి అధికారులు వచ్చి విచారణ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన మళ్లీ విచారణ ఉంది. ఆ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని లోకాయుక్త చెప్పింది.-రాంబాబు, రైతు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details