అనంతపురం జిల్లాలో నిబంధనలకు విరద్ధంగా గనుల శాఖ అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిపే గనుల క్వారీలపై కేసులున్నా తెరచుకున్నాయి.
● జిల్లాలో వివాదాస్పద ఓబుళాపురం ఇనుప ఖనిజ గనుల్లో దశాబ్దం కిందట పెద్దఎత్తున అక్రమాలు జరగడంతో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర లీజులకు కూడా అధికారులు అప్పటి నుంచి అనుమతులు జారీ చేయడం లేదు. ఆ ప్రాంతంలో ఓ లీజుదారునికి అనంతపురంలోని గనుల శాఖ అధికారులు నెల కిందట అనుమతులు జారీ చేశారు. దీంతో యథేచ్ఛగా ఖనిజాన్ని తరలిస్తున్నారు.
● జిల్లా కేంద్రానికి దగ్గరలోని ఓ గ్రామం వద్ద 20కి పైగా రహదారి కంకర (రోడ్ మెటల్) క్వారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తున్నారనే కారణంతో అధికారులు కేసులు పెట్టి, అపరాధ రుసుం విధించి క్వారీలను సీజ్ చేశారు. లీజుదారుడు అన్ని అనుమతులు పొందిన తర్వాతే మళ్లీ క్వారీల్లో తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. వాటికీ ఇటీవల అనుమతులు వచ్చేశాయి.
● ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో గనుల నిఘా అధికారులు ‘మహాచెక్’ పేరుతో అనంతపురం ఏడీ పరిధిలోని 34 గ్రానైట్, కంకర క్వారీలపై దాడులు నిర్వహించారు. పొందిన లీజు కంటే హద్దులు దాటి తవ్వకాలు జరిపినట్లు, రాయల్టీ చెల్లింపులు సక్రమంగా లేవని గుర్తించారు. దీంతో ఆ క్వారీలపై కేసులు నమోదు చేసి, రూ.59.32 కోట్ల అపరాధ రుసుం విధించారు. కేసులున్నా.. వీటిలో కొన్ని క్వారీలకు అధికారులు అనుమతులిచ్చినట్లు తెలిసింది.
● బిల్డింగ్ కంకర, క్యూబ్స్, డోలమైట్, స్టియటైట్, ఇనుముతో కలిపి మొత్తం 107 క్వారీలు పని చేయడం లేదు. కేసులున్నా.. ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా క్వారీల యజమానులు అనుమతులు పొందుతున్నారు.
నిబంధనలు ఇలా...
క్వారీల్లో తవ్వి తీసిన ఖనిజాన్ని లీజుదారులు తరలించాలంటే ముందుగా ఆన్లైన్లో ఆటో పర్మిట్లకు దరఖాస్తు చేసుకోవాలి. లీజుదారు దరఖాస్తు మేరకు ఏడీ స్థాయి అధికారితో తనిఖీ చేయించాలి. సాంకేతిక సహాయక లేదా రాయల్టీ అధికారులు క్వారీలకు వెళ్లి అసలైన లీజుప్రాంతం నుంచి ఖనిజాన్ని తవ్వుతున్నారా? లేదా? ఎంత మేర తవ్వారు? అనే అంశాలను పరిశీలిస్తారు. తవ్విన ఖనిజాన్ని క్యూబిక్ మీటర్లు లేదా టన్నుల్లో కొలుస్తారు. తనిఖీ చేసిన నివేదిక అనుసరించి అధికారులు అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కొత్త నిబంధన ప్రకారం విజిలెన్సు, మైనింగ్, ఇతర ఉన్నత సంస్థలు సీజ్ చేసిన ఖనిజాన్ని, పర్యావరణ అనుమతులు(ఈసీ) లేని క్వారీలకు ఎలాంటి అనుమతి ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పద క్వారీలకూ...
2015లో మడకశిర నియోజకవర్గంలోని ఓ క్వారీ నుంచి గ్రానైట్ రాయిని లారీలో తరలిస్తుండగా.. పెనుకొండ వద్ద ఆ రాయి రైలు పెట్టెలోకి దూసుకెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన కొద్ది రోజులకే సదరు క్వారీని గనుల అధికారులు సీజ్ చేసి, రూ.4 కోట్లకు పైగా పెనాల్టీ విధించారు. లీజుదారుడు ఎలాంటి పెనాల్టీ చెల్లించకపోగా, ప్రస్తుతం అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.