పల్లె వైద్యం పడకేసింది.. ప్రాథమిక వైద్య సేవలు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. పలు ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు, సిబ్బంది సక్రమంగా హాజరు కావడం లేదు. విధులకు ఆలస్యంగా వస్తున్నారు.. మధ్యాహ్నానికే ఇంటికి వెళుతున్నారు. 24 గంటలు పనిచేయాల్సిన పీహెచ్సీలు సాయంత్రానికి మూతపడుతున్నాయి. వీటిపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. పలు ప్రాంతాల్లో సిబ్బందే తమకు తెలిసిన వైద్యం చేసి రోగులకు మందులు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో జ్వరం, దగ్గు, జలుబు వచ్చినా గ్రామీణులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.
విజృంభిస్తున్న విష జ్వరాలు
జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. ప్రతి పల్లె, మురికివాడలో జ్వర బాధితుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. డెంగీ మహమ్మారి కోరలు చాచింది. ప్రతి వంద మందిలో 20 నుంచి 30 మంది దాకా డెంగీ బారిన పడుతున్నారు. మలేరియా కూడా చాపకింద నీరులా పాకుతోంది. జిల్లా అంతటా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటోంది. దీంతో లార్వా పెరుగుతోంది. దోమల బెడద తీవ్రం కావడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. మరోవైపు కలుషిత నీరు తాగడంతో టైఫాయిడ్, పచ్చకామెర్లు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడీ పట్టే నాథుడే లేరు.
లెక్కలు దాచేస్తూ..
జిల్లాలో ఈ ఏడాది డెంగీ, మలేరియా ప్రబలుతున్నాయి. ఇప్పటిదాకా 4,123 మంది అనుమానితుల నుంచి రక్త నవ΄నాలు తీసి పరీక్షించారు. వీరిలో 99 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. 2.34 లక్షల మంది రక్త నవ΄నాలు పరీక్షించగా.. పదకొండు మందికి మలేరియా ఉన్నట్లు తేల్చారు. జులై మాసంలోనే సర్వజనాస్పత్రిలో 105 మంది డెంగీ రోగులకు వైద్య చికిత్స అందించారు. ఎనిమిది మాసాలకు 99 మందినే లెక్కల్లో చూపించారు. దీన్నిబట్టి తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డెంగీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు.
పేరుకే 24 గంటల ఆసుపత్రి
పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
విడపనకల్లు మండలంలోని పాల్తూరు పెద్ద గ్రామం. పదివేల జనాభా ఉంది. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. 24 గంటలు సేవలు అందించాల్సి ఉంది. ఇటీవల ఆరోగ్య కేంద్రాన్ని ‘న్యూస్టుడే’ పరిశీలించగా.. ఉదయం తొమ్మిది గంటలకు ఆసుపత్రిని వాచ్మెన్ తెరిచి ఉంచాడు. 10.10 గంటలకు ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్నర్సు, అటెండర్, కాంపౌండర్, డేటా ఆపరేటర్ వచ్చారు. అవుట్ పేషెంట్లకు అటెండర్ ఓపీ చీటీలు రాసి ఇవ్వగా స్టాఫ్నర్సు మందులు పంపిణీ చేశారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉన్నారు. వీరు గుంతకల్లు, అనంతపురం నుంచి వస్తున్నారని, నిత్యం ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్లు రోగులు ఆరోపించారు. సాయంత్రం 4 గంటల తర్వాత వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. నిత్యం 70 నుంచి 80 మంది దాకా ఓపీ సంఖ్య ఉంటుంది.
జిల్లా కేంద్రానికి పరుగులు