ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ - peanut seeds distribution in anantapur

అనంతపురం జిల్లాలో 'రైతుల విత్తనం రైతులకే' కార్యక్రమం ప్రయోగాత్మకంగా మొదలైంది. తొలిసారిగా అనంతపురం జిల్లా పైలెట్ ప్రాజక్టుగా రబీలో వేరుశనగ పండించిన రైతుల నుంచి విత్తన కాయ సేకరించి, అదే గ్రామాల్లోని రైతులకు పంపిణీ చేస్తున్నారు. వేరుశనగ రాయితీ విత్తనం గ్రామస్థాయిలో పంపిణీని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు సోమవారం అన్ని నియోజకవర్గాల్లో లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయాల్లో సర్వర్లు మొరాయించటంతో విత్తనం కోసం పేర్ల నమోదుకు వచ్చిన రైతులు వెనుతిరిగి వెళ్లారు. ప్రతి గ్రామంలో వేగవంతంగా వేరుశనగ విత్తన పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక చేశారు.

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ
అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ

By

Published : May 19, 2020, 6:19 PM IST

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల 60 వేల హెక్టార్లలో వేరుశనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆ మేరకు ప్రభుత్వం 3.34 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఏటా వేరుశనగ విత్తనం గుత్తేదారుల నుంచి సేకరించి రైతులకు రాయితీపై పంపిణీ చేసే ప్రక్రియ నిర్వహించేవారు. ఈసారి లక్ష క్వింటాళ్ల వేరుశనగ రైతుల నుంచే సేకరించి, ఎక్కడికక్కడ గ్రామాల్లో అవసరమైన రైతులకు పంపిణీ చేయాలని ప్రణాళిక చేశారు. అయితే లక్ష్యం మేరకు సేకరణ చేయలేక పోవటంతో, సింహ భాగం గుత్తేదారులు సరఫరా చేసిన విత్తనమే పంపిణీ చేస్తున్నారు. ఏటా వేరుశనగ విత్తనం మండల కేంద్రంలో మాత్రమే పంపిణీ చేసేవారు. ఈ విధానంలో రైతులు చాలా ఇబ్బంది పడేవారు. ఈసారి గ్రామస్థాయిలో సచివాలయాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని తొలిరోజు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

వేరుశనగ రాయితీ విత్తనం కావల్సిన రైతులు గ్రామ సచివాలయంలో బయోమెట్రిక్ పద్దతిలో పేరు నమోదుచేసుకొని, డబ్బు చెల్లిస్తే రెండు రోజుల తరువాత విత్తనం అక్కడే ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి రైతుల పేర్ల నమోదును ప్రారంభించారు. అయితే సర్వర్లు మొరాయిస్తుండటంతో రైతులు రోజూ సచివాలయాలకు రావటం గంటల తరబడి వేచిచూసి వెనుతిరగాల్సి వస్తోంది. సోమవారం కూడా చాలా గ్రామాల్లో బయోమెట్రిక్ పేర్ల నమోదు ముందుకు సాగక వేలాది మంది రైతులు వేచి చూసి వెనక్కు వెళ్లారు. మరోవైపు ఏటా ఒక్కో రైతుకు నాలుగు బస్తాల వేరుశనగ ఇస్తుండగా, ఈసారి మూడు బస్తాలే ఇస్తుండటంతో ప్రజాప్రతినిధుల ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జూన్ తొలి వారంలో నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించటంతో వేరుశనగ విత్తన కాయలు వారం రోజుల్లోపు రైతులందరికీ అందించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక చేసింది.

ఇవీ చదవండి: రాయితీపై వరి విత్తనాల పంపిణీ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details