తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగం పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగుతుందనుకోవడం భ్రమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరపురంలో తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని ప్రజలు తెదేపాకు వ్యతిరేకంగా ఓటేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమని కోరాడనే జగన్కు అధికారం ఇచ్చారని అన్నారు. ఎన్నికల ముందు అమరావతికి జగన్ మద్దతు ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలన్నీ పారిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. డేటా సెంటర్ రాకుండా ఈ ముఖ్యమంత్రి అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. విశాఖ ప్రాంతంలో వైకాపా నేతలు ఆస్తులు కొన్నారని... వాటి విలువ పెంచేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపద పెంచేందుకు సీఎం జగన్కు ఓనమాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. న్యాయం పాండవులవైపే...
శాసనసభ మయసభను మరిపించిందని చంద్రబాబు అన్నారు. కౌరవులంతా ఆ పక్కన ఉన్నా...న్యాయం ఎప్పుడూ పాండవులవైపే ఉంటుందని చెప్పారు. 'మీ తెలివితేటలు నాపై ఉపయోగిస్తే మీకే ఇబ్బందులు వస్తాయి. ఏదైనా తమాషా అనుకొని మీ ఇష్ట ప్రకారం చేస్తే వడ్డీతో సహా మళ్లీ చెల్లించే రోజులు వస్తాయి' అని హెచ్చరించారు.
కియాతో ఉద్యోగాలు
కియా మోటార్స్ మహారాష్ట్రకు వెళ్లకుండా అడ్డుకుని రాష్ట్రానికి తెచ్చామని చంద్రబాబు అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా, 8 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. 6 నెలల్లో గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కియా మోటార్స్కు నీళ్లిచ్చామని గుర్తు చేశారు.
రివర్స్ టెండరింగ్ కాదు... రిజర్వ్ టెండరింగ్
ఎవరేం చేయాలన్నా ఇప్పుడు జె-ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు ఆరోపించారు. మద్యం ధరలు విపరీతంగా పెంచటంతో... తెలంగాణ నుంచి మద్యం మన రాష్ట్రానికి వస్తోందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం చేసిన పనుల వల్ల తెలంగాణ మద్యం ఆదాయం బాగా పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ కాకుండా... రిజర్వ్ టెండరింగ్ జరుగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారని... ప్రజాధనం విధ్వంసం చేసే హక్కు ఈ సీఎంకు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కాదు'