ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిధులు రాక.. పథకాలు అమలు కాక.. అయోమయంలో పాడి పరిశ్రమ!

By

Published : Jul 5, 2021, 6:33 PM IST

అనంతపురం జిల్లాలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం కరవైంది. ప్రస్తుతం రాయితీలను అటకెక్కించి.. గడ్డిపోచ కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. నిధులు రాక.. పథకాలు అమలుకాక అటు అధికారులు, ఇటు పశు పోషకులు అయోమయంలో పడ్డారు.

Dairy industry
పాడి పరిశ్రమ

జిల్లాలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం కరవైంది. రాయితీ పథకాలు అందకుండా పోతున్నాయి. గతంలో పాల ఉత్పత్తి పెంచేందుకు దాణా, దాణామృతం, మాగుడు గడ్డి రాయితీతో ఇచ్చారు. మేలుజాతి పశువులను అందించారు. జిల్లా అంతటా పాలశీతలీకరణ కేంద్రాల ద్వారా పాలు సేకరించి, పాడి పరిశ్రమను ఆదుకున్నారు. ప్రస్తుతం అంతా తారుమారైంది. డెయిరీలను మూసేశారు. పశు పథకాల గురించి మరిచిపోయారు. రాయితీలను అటకెక్కించారు. కనీసం గడ్డిపోచ కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు పశువైద్యులే చెప్పడం గమనార్హం. నిధులు రాక.. పథకాలు అమలుకాక అటు అధికారులు, ఇటు పశు పోషకులు అయోమయంలో పడ్డారు.

ఏడాదిగా నిధుల్లేవ్‌!

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశునష్ట పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 సెప్టెంబరులో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఏడాదికి ఒక్కో కుటుంబానికి 5 పశువులు, 20 గొర్రెలు, మేకల వరకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. పశువు చనిపోతే రూ.30 వేలు, గొర్రె, మేక చనిపోతే రూ.6 వేలు చొప్పున పోషకులు, కాపర్లకు తొలి ఏడాదిలో పంపిణీ చేశారు. ఆ తర్వాత నిధులు ఆగిపోయాయి. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నామని పలువురు పశువైద్యులు చెబుతున్నారు. ఈ పథకానికి ఏడాది నుంచి నిధులు ఆగిపోయాయి. దీంతో ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడం లేదు.

జిల్లాలో రెండేళ్లలో 8 వేల పశువులు చనిపోయాయి. ఒక్కో పశువుకు రూ.30 వేలు చొప్పున రూ.24 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా.. 2,619 పశువులకు రూ.7.85 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 5,351 పశువులకు రూ.16.15 కోట్లు చెల్లించాల్సి ఉంది.జిల్లాలో 2,790 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. ఒక్కో గొర్రె, మేకకు రూ.6 వేల చొప్పున రూ.1,67,40,000 పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,071 గొర్రెలు, మేకలకు రూ.64.26 లక్షలు అందించారు. ఇంకా 1,719 గొర్రెలు, మేకలకు రూ.1,03,14,000 పరిహారం కాపరులకు ఇవ్వాల్సి ఉంది.

పశుగ్రాసం ఎక్కడ..?

పాల ఉత్పత్తి పెంచేందుకు ఏటా పశువులకు మాగుడుగడ్డి (సైలేజ్‌ బేళ్లను), దాణా, దాణామృతం, వివిధ రకాల గడ్డి విత్తనాలను రాయితీతో అందించేవారు. ఏటా పశుశాఖ అధికారులతో టన్నులకొద్దీ రైతులు కొనేవారు. ప్రస్తుతం గడ్డి విత్తనాలు తప్ప ఏమీ ఇవ్వడంలేదు. గడ్డి విత్తనాలు, గడ్డి పెంపకానికి ఈ ఏడాది ఉపాధిహామీ పశుగ్రాస పథకం కింద బహువార్షిక పశుగ్రాస రకాలు పెంచేందుకు 1,100 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎకరా గడ్డి పెంచేందుకు రెండేళ్లకు రూ.83,654 ఇస్తారు. ఐదెకరాల్లోపు ఉన్న రైతులు అర్హులు. ఈ ప్రక్రియ దరఖాస్తులు, ఆన్‌లైన్‌ నమోదు దశలోనే ఉంది.

అందని చేయూత

గతంలో పశుక్రాంతి, జీవక్రాంతి పథకాల ద్వారా పాడిపశువులు, గొర్రెలను రాయితీతో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చేది. ఆ పథకాలను పూర్తిగా ఎత్తేశారు. దానికి బదులుగా వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్లకు రూ.75 వేలు చెల్లించనున్నారు. 2020 ఆగస్టులో ప్రారంభమైంది. రెండో ఏడాది కింద సొమ్ము మంజూరు చేశారు. ఇప్పటివరకు 6,496 పశువుల యూనిట్లు, 11,722 గొర్రెలు, మేకలు యూనిట్లు మంజూరు చేశారు. ఇంకా 6,749 పశువులు, 9,789 గొర్రెలు, మేకల యూనిట్లకు సొమ్ము మంజూరు చేయాల్సి ఉంది. అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులే ఎక్కువ యూనిట్లు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

డెయిరీల మూత

అనంతపురం, హిందూపురంలో ఏపీ డెయిరీలకు సొంత భవనాలు ఉన్నాయి. వాటి కింద పాలశీతలీకరణ కేంద్రాలు ఉండేవి. గత రెండేళ్ల నుంచి డెయిరీలను పూర్తిగా విస్మరించారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. తొమ్మిది నెలల కిందట 26 మందిని తొలగించారు. సామగ్రినంతా చిత్తూరు జిల్లాకు తరలించారు. రెండు డెయిరీలు, పాలశీతలీకరణ కేంద్రాలన్నీ పూర్తిగా మూసేశారు. అమూల్‌ సంస్థకు డెయిరీలను ధారాదత్తం చేశారు. జిల్లాలో మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. తొలి విడతలో ఐదు మండలాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో పాల ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, పాల సేకరణ ప్రారంభిస్తారని పశుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కడా సంఘాలు ఏర్పాటు కాలేదు.

పథకాల అమలుకు చర్యలు

జిల్లాలో పశు పథకాల అమలుకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పశునష్ట పథకానికి రూ.1.75 కోట్లు మంజూరైంది. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తాం. చేయూత పథకం లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేశాం. విడతల వారీగా ప్రభుత్వం సొమ్ము మంజూరు చేస్తోంది. మాగుడు గడ్డి, దాణా, దాణామృతం ఇవ్వడంలేదు. గడ్డి విత్తనాలను 75 శాతం రాయితీతో, ఉపాధి నిధులతో గడ్డి పెంపకానికి చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్‌ వెంకటేష్‌, జేడీఏ, పశుసంవర్ధకశాఖ

ఇదీ చదవండి:

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: తెదేపా

ABOUT THE AUTHOR

...view details