ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cyber Crime: మాటలతో ఎరవేసి.. ఆన్‌లైన్‌లో దోచేసి! - సైబర్ నేరస్ధుడు అరెస్ట్ వార్తలు

సామాజిక మాధ్యమమే ఆయుధం.. అమాయక యువతులే లక్ష్యం.. మాయ మాటలే పెట్టుబడి.. బ్లాక్‌మెయిలే ఆదాయ మార్గం.. ఇదీ ఆ యువకుడి తీరు. గంజాయి విక్రేత అనే అనుమానంతో పోలీసులు తనిఖీ చేయడంతో అసలు నేర చరిత్ర వెలుగు చూసింది. ఎట్టకేలకు అనంత దిశ పోలీసులు ఆ మోసగాడి ఆటకట్టించారు.

Cyber Crime in Anantapur District
మాటలతో ఎరవేసి.. ఆన్‌లైన్‌లో దోచేసి!

By

Published : Jun 4, 2021, 11:47 AM IST

అనంతపురం భైరవనగర్‌కు చెందిన టి.భరత్‌రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సత్యఏసుబాబు వివరాలు వెల్లడించారు.

ఇదీ నేర చరిత్ర..

భరత్‌రెడ్డి బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తిచేశాడు. క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాటకు బానిసగా మారాడు. ఎలాంటి సంపాదన లేకపోవడంతో మోసాల బాట పట్టాడు. ఫేస్‌బుక్‌, టిండర్‌ యాప్‌, తెలుగు మాట్రిమోనిలలో నకిలీ ఐడీలతో సిద్ధార్థరెడ్డి పేరుతో ఖాతాలు తెరిచాడు. అందమైన యువకుడి ఫొటోను తన ఫేస్‌బుక్‌ ఖాతా ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టాడు. ఈ నకిలీ ఖాతా ద్వారా యువతులకు పరిచయం అయ్యాడు. చాటింగ్‌లు, వాయిస్‌ కాల్స్‌ కొనసాగించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. గుడ్డిగా నమ్మిన యువతుల నుంచి నగ్న దృశ్యాలు, వీడియోలను రికార్డ్‌ చేయించుకొని తన మొబైల్‌కు తెప్పించుకునేవాడు. హైదరాబాద్‌, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను నమ్మించాడు. సుమారు రూ.5 లక్షల వరకు అమ్మాయిల నుంచి తన బ్యాంకు ఖాతాలోకి, ఫోన్‌పే, గూగుల్‌ పే ఖాతాలకూ నగదు బదిలీ చేయించుకున్నాడు. సుమారు 20 మంది యువతులు బాధితులుగా ఉన్నారు. ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వంచనకు గురయ్యారు. అంతేకాకుండా యువతులు, మహిళలు స్నానం చేసే సమయాల్లో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించేవాడని, గంజాయి విక్రయాలకూ పాల్పడేవాడు. నిందితుడిపై ఇప్పటికే అనంతపురం ఒకటి, రెండో పట్టణ పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి

మహిళలపై జరిగే సైబర్‌ నేరాల నుంచి రక్షించేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు.. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఐడీలను సృష్టించి మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదు. భరత్‌రెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులును సంప్రదించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమైన, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయవద్దని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Nellore GGH: వైద్య విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన..సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్‌!

ABOUT THE AUTHOR

...view details