పేరు మార్చి కనికట్టు...కంటి వెలుగు ఓ జగన్మాయ గుంటూరు.. పార్టీ కార్యలయంలో ముఖ్యనేతలతో తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారు. తెదేపా ప్రభుత్వ పథకానికి కంటివెలుగని పేరు మార్చి ప్రజలను ఏమారుస్తున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు పెట్టి, 67లక్షల మందికి ఉచిత కంటి చికిత్స చేయించామన్నారు. 3లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చామని గుర్తుచేశారు. ఆటోలకు జగన్ స్టిక్కర్లు అతికించడంలో రవాణా శాఖ, పోలీసుల యొక్క చర్యను చంద్రబాబు ఖండించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భూమా అఖిలప్రియను అణగదొక్కడానికే ఆమె భర్త భార్గవ రామ్పై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మద్యంపై జె-ట్యాక్స్
నరేగా పథకం పనులకు కేంద్రం ఇచ్చిన డబ్బులు మూడు రోజుల్లో విడుదల చేయాలని.. లేదా 12శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జె-ట్యాక్స్ విధించి మద్యం ధరలు పెంచి, తాగుబోతులను కూడా వదలకుండా జలగల్లా పీలుస్తున్నరంటూ ఆక్షేపించారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గ్రామసచివాలయాలు పెద్ద గోల్మాల్
వలంటీర్లు, గ్రామ సచివాలయ నియామకాలన్నీ పెద్ద గోల్ మాల్ అన్న చంద్రబాబు... లక్షలాది చిరుద్యోగులను వేధింపులకు గురిచేసి అన్యాయంగా తొలగించారని విమర్శించారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడంపై మానవహక్కుల కమిషన్, కేంద్రహోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
అప్పు ఇచ్చే వాళ్లు వెనక్కి పోయే దుస్థితి
రాష్ట్రానికి అప్పు ఇచ్చేవాళ్లు కూడా వెనక్కి పోయే దుస్థితి తెచ్చారన్న చంద్రబాబు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ ఇందుకు ఉదాహరణ అన్నారు. గత ప్రభుత్వాలిచ్చిన హామీలను గౌరవించకపోవడం వల్లే, రాష్ట్రానికి ఇప్పుడీ పరిస్థితి దాపరించిందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
ఆరు దశల్లో కంటి వెలుగు... ఈ నెల 10న సీఎం శ్రీకారం