హిందూపురం 'మాధవ్'..పోటీకి దారేదీ? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆ మధ్య వినాయక ఉత్సవాల సందర్భంగా జేసీ సోదరులకు.. ప్రబోధానంద ఆశ్రమానికి మధ్య జరిగిన గొడవలో హైలైట్ అయ్యారు మాధవ్. ఈ గొడవలో జేసీ దివాకర్రెడ్డి పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. జిల్లా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఫైరయ్యారు. రండి చూసుకుందాం.. అంటూ మీడియా ముందు మీసం తిప్పారు. ఈ గొడవతో ప్రాముఖ్యత వచ్చిన ఆయనకు వైకాపా ..హిందూపురం పార్లమెంట్ స్థానం సీటును కేటాయించింది. రాజకీయాల్లో చేరడం కోసం ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణకు దరఖాస్తు చేశారు. అయితే దీనికి పోలీసుశాఖ అనుమతి ఇంకా రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన నామినేషన్ దాఖలు చేయలేకపోతున్నారు. మాధవ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. పోటీకి పచ్చజెండా ఊపింది. అయితే ఆయనపై రెండు ఛార్జ్ మెమోలు ఉన్నాయని.. వీఆర్ఎస్ వెంటనే సాధ్యం కాదంటూ...పోలీసు శాఖ హైకోర్టును ఆశ్రయించడంతో...మళ్లీ బ్రేక్ పడింది.
హైకోర్టులో ఊరట లభిస్తేనే..
తాజాగా ట్రిబ్యునల్ ఆదేశాలపై పోలీస్ ఉన్నతాధికారులు హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. ఒకవేళ మాధవ్కు అనుకూలంగా తీర్పు రాకపోతే ఇబ్బందులు తప్పవు. స్టే ఇస్తే, నామినేషన్ వేసేందుకు అవకాశం ఉండదు. మరోవైపు సోమవారమే నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో గుబులు మొదలైంది. ఈ కథ కొనసాగుతుండగానే శుక్రవారం వైకాపా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ తరపున ఓ సెట్ నామినేషన్ దాఖలు అయింది. అలాగే ఆయన సతీమణి సవిత పేరిట ఓ సెట్ నామినేషన్ వేశారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఎం.కిష్ణప్ప కూడా ఓ సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ మూడు నామినేషన్లూ వైకాపా తరఫునే వేయడం విశేషం. మాధవ్ వీఆర్ఎస్ ఆమోదం పొందకపోతే, రిటైర్డ్ న్యాయమూర్తి కిష్ణప్పను బరిలో దించుతారని తెలుస్తోంది. మొత్తానికి మాధవ్ బరిలో ఉంటారా? లేదా? అనేది సోమవారం తేలనుంది.
ఆ రెండు మెమోలే...గండం
గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ఆమోదానికి రెండు ఛార్జ్మెమోలు పెండింగ్లో ఉండటమే ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. వీఆర్ఎస్ ఆమోదం పొందకుండానే.. ఓ సామాజికవర్గ సమావేశానికి హాజరుకావడంతో చార్జ్మెమో ఇచ్చారు. 2017లో ఆయన అనంతపురంలో సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ యువ జంట ప్రేమ వివాహం సందర్భంగా ఆ యువకుడి పట్ల మాధవ్ వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. దీనిపై కూడా మాధవ్కు ఛార్జ్మెమో ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఉపశమమం వస్తేనే.. ఆయన పోటీకి గండం తప్పేది.
ఇదీ చదవండి:విజయం కోసం.. జతకట్టిన 'జమ్మలమడుగు వైరం'!