ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 24, 2020, 1:33 PM IST

ETV Bharat / state

కంటైన్​మెంట్​ జోన్లలో ఫీవర్ క్లీనిక్​లు ఏర్పాటుచేశాం: డీఎంహెచ్​వో

కరోనా వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని అనంతపురం జిల్లా వైద్యాధికారి డా.అనిల్ కుమార్ అంటున్నారు. వ్యాధి సోకిన ప్రాంతాలను క్లస్టర్ల కింద ఉంచుతూ ఫీవర్ క్లీనిక్​లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోనటానికి తగిన వైద్య సౌకర్యాలు కల్పించామంటున్న డీఎంహెచ్​వో డా.అనిల్ కుమార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

కంటైన్​మెంట్​ జోన్లలలో ఫీవర్ క్లీనిక్​లు ఏర్పాటుచేశాం : డీఎంహెచ్​వో
కంటైన్​మెంట్​ జోన్లలలో ఫీవర్ క్లీనిక్​లు ఏర్పాటుచేశాం : డీఎంహెచ్​వో

ఈటీవీ భారత్: అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..?

డా.అనిల్ కుమార్: ఇప్పటి వరకూ జిల్లాలో 11 వందల కేసులు నమోదయ్యాయి. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వైరస్ తారాస్థాయికి వెళ్లి, మళ్లీ తగ్గనుంది.

ఈటీవీ భారత్: జిల్లాలో వైరస్ ఎక్కువగా గ్రామాల్లో విస్తరిస్తోందా..? పట్టణాల్లో వ్యాప్తి చెందుతుందా ..?

డా.అనిల్ కుమార్: కరోనా కేసులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే వస్తున్నాయి.

ఈటీవీ భారత్ : వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చర్యలేమన్నా తీసుకున్నారా..? కరోనా విస్తరణ జిల్లాలో ఏ స్థాయిలో ఉంది..?

డా.అనిల్ కుమార్: వ్యాక్సిన్ రావటం ఒక్కటే వైరస్ వ్యాప్తి నిరోధానికి మార్గం. 85 శాతం మందికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఐదు శాతం మందికే వెంటిలేటర్ అవసరం ఉంటుంది. రెండు నుంచి మూడు శాతం మంది, అదీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలోనే మరణాలు ఉంటాయి.

ఈటీవీ భారత్: జిల్లా వ్యాప్తంగా ప్రయోగశాలలు ఎన్ని ఉన్నాయి..? ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు..?

డా.అనిల్ కుమార్ : జిల్లాలో ఐదు ల్యాబోరేటరీలు ఉన్నాయి. అన్ని చోట్లా మూడు వందల నుంచి ఆరు వందల వరకు రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

ఈటీవీ భారత్ : జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్వారంటైన్ కేంద్రాలున్నాయి..? ఎన్ని కొవిడ్ ఆసుపత్రులున్నాయి..?

డా.అనిల్ కుమార్: కొవిడ్ ఆసుపత్రిగా సవేరా చికిత్స కేంద్రంగా ఏర్పాటు చేశాం. హిందూపురం, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.

ఈటీవీ భారత్: కొవిడ్ సోకిన వారికి ఎక్కడ చికిత్స అందిస్తున్నారు..?

డా.అనిల్ కుమార్ : పాజిటివ్ నిర్ధరణ కాగానే మూడు ఐచ్ఛికాలు ఇస్తున్నాం. వైరస్ సోకిన వారు ఇంటి వద్దనే ఉండటం, కొవిడ్ ఆసుపత్రికి వెళ్లటం, తిరుపతిలోని రాష్ట్ర స్థాయి కొవిడ్ ఆసుపత్రికి వెళ్లటం వంటి వాటిలో బాధితుడే నిర్ణయించుకోవచ్చు. గృహంలోనే ఉండే వారికి జాగ్రత్తలు చెప్పి, తగిన వైద్యం అందిస్తున్నాం.

ఈటీవీ భారత్ : జిల్లాలో ఎన్ని రెడ్ జోన్లు ఉన్నాయి..?

డా.అనిల్ కుమార్ : కంటైన్​మెంట్ కేంద్రాలకు బదులుగా క్లస్టర్లను ఏర్పాటు చేశాం. జిల్లాలో 18 క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ ఫీవర్ క్లీనిక్​లు ఏర్పాటు చేశాం.

ఈటీవీ భారత్ : జులై 15వ తేదీకి వైరస్ మరింత తీవ్రంగా విస్తరించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు..?దీనిపై మీకు అందిన సమాచారం ఏంటి..?

డా.అనిల్ కుమార్ : జులై రెండో వారానికి వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందనుంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా ఐదు వేల పడకలతో ప్రత్యేకంగా జిల్లాలో పలుచోట్ల ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. గుంతకల్లు రైల్వే ఆసుపత్రి, పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రులను తీసుకున్నాం. వైద్యులు, నర్సులను నియమించుకోటానికి ప్రకటనలు జారీచేశాం.

ఈటీవీ భారత్ : వైరస్ బాధితులకు సేవలందించే వైద్యులు, రెవెన్యూ అధికారులకు సైతం వైరస్ సోకుతోంది..? వారికి ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పే వర్కషాప్ లాంటిది ఏదైనా నిర్వహిస్తున్నారా..?

డా.అనిల్ కుమార్ : మాస్క్ ధరించటం తప్పనిసరి చేశాం. దూరంగా ఉండాలి, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నాం.

ఈటీవీ భారత్ : జిల్లాలో జైళ్లలో ఖైదీలకు కూడా వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది..? ఆ వివరాలేంటి..?

డా.అనిల్ కుమార్ : అనంతపురం సబ్ జైల్​లో పాజిటివ్ వచ్చింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నాం.

ఇదీ చదవండి :ఇతర రాష్ట్రాల్లో పాలసీలు ఎలా ఉన్నాయో నివేదిక ఇవ్వండి: మంత్రి

ABOUT THE AUTHOR

...view details