వరుణుడు కరుణించాడు. ఎగువన తుంగభద్రమ్మ.. పొరుగున కృష్ణమ్మ ఆశీర్వదించారు. సుజలాలు పుష్కలంగా దరి చేరాయి. అన్ని పంటలు బాగా పండాయి. ఇక కష్టాల నుంచి గట్టెక్కామని కర్షకులు మురిసినంతసేపు పట్టలేదు. ఒక్క ఉదుటున కరోనా కత్తి దూసింది. రైతు ఆశలు తుత్తునియలు చేసింది. ఫలం కళ్లెదుటే ఉన్నా.. ప్రతిఫలం దక్కని దయనీయమిది. కొన్ని ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటైనా కొనుగోళ్లు ఊపందుకోలేదు. మరికొన్నింటికి ఆ ఊసే లేదు. అధికారులు స్పందించి చొరవ తీసుకుంటేనే రైతు మోము వెలిగేది.
రైతన్నా.. నీకోసం
ఉద్యాన రైతులు.. ఉత్పత్తుల రవాణాకు అనుమతులు.. విపణికి తరలింపులో ఇబ్బందులు ఎదురైతే 08554-275805కు ఫోన్ చేస్తే వారి కష్టాలు చక్కదిద్దుతామని జేడీఏ హబీబ్బాషా తెలిపారు.
కౌలు చెల్లించేదెలా?
నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. ఎకరాకు 40 బస్తాలు చేతికొచ్చింది. మద్దతు ధర కన్నా రూ.300 తక్కువకు వ్యాపారులు అడుగుతున్నారు. ఆ ధరకు అమ్మితే కౌలుపోగా పెట్టుబడి కూడా రాదు. ఆ ధరకు అమ్ముకోలేక ధాన్యాన్ని దారిపై ఆరబెడుతూ రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నా. - ఎర్రిస్వామి, కణేకల్లు
కొనుగోళ్లు వేగవంతం చేస్తాం
మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరలోనే పెట్టి ఎంపిక చేసిన రకాలను కొంటాం. ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు స్థానికంగా అనుమతులు ఇప్పిస్తున్నాం. తరలింపునకు సహకరించాలని పోలీసు శాఖకు సూచించాం. - గంధం చంద్రుడు, కలెక్టర్
వరికోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ఖరీఫ్లోనూ కేంద్రాలు పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. అడపాదడపా ఈదురు గాలులు, వర్షాలకు ధాన్యం తడుస్తోంది. ఈ కష్టకాలంలోనైనా కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు పంట కొనాలి.