ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్లె కదిలింది... ఓటు మురిసింది!

అనంతపురం జిల్లాలో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత తరలివచ్చింది. 81.19 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

By

Published : Feb 10, 2021, 8:33 AM IST

Published : Feb 10, 2021, 8:33 AM IST

anantapur
అనంతపురం జిల్లా

జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కదిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో మంగళవారం పోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం, అధికారుల ముందస్తు చర్యలు ఫలించాయి. ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది. మరోవైపు ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు తరలివచ్చారు. బారులు తీరి, తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 169 పంచాయతీలు, 1714 వార్డులు ఉండగా.. 6 సర్పంచి స్థానాలు, 715 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 15 వార్డులకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. 163 పంచాయతీలు, 984 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 984 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.పోలింగ్‌ అనంతరం అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి, విజేతలను ప్రకటించారు.

కరోనా నియంత్రణ చర్యలు

ప్రతి ఓటరుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించారు. అన్ని కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేశారు. క్రమశిక్షణతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో 4:30 వరకు పోలింగ్‌ కొనసాగింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత 30 నిమిషాలు విరామం తీసుకుని లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.

మందకొడిగా ప్రారంభమై

ఉదయం 6:30 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి రెండు గంటలపాటు మందకొడిగా సాగింది. ఆ తర్వాత పుంజుకుంది. ఉదయం 7:30 గంటలకు 7 శాతం, 8:30కు 14 శాతం, 9:30కు 27 శాతం, 10:30కు 45 శాతం, 11:30కు 57.83 శాతం, 12:30కు 70.46 శాతం, 1:30కు 76.89 శాతం, 2:30కు 79.35 శాతం, 3:30కు 81.19 శాతం నమోదైంది.

3,43,420 మంది..

12 మండలాల పరిధిలోని 169 పంచాయతీల్లో 3,43,420 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,72,031, స్త్రీలు 1,71,380 మంది ఉన్నారు. ఇతరులు 9 మంది ఓటు వేశారు.

భద్రత కట్టుదిట్టం

ఎన్నికల చిత్రాలు

పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మండలానికి ఒక డీఎస్పీని ఇన్‌ఛార్జిగా నియమించారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 110 మంది ఎస్సైలు, 3,000 మంది కానిస్టేబుళ్లు, 900 మంది మహిళా పోలీసులు, 200 మంది ఎస్పీవోలు పాల్గొన్నారు. వీరంతా ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా కీలకపాత్ర పోషించారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్‌ కేంద్రంలోకి మోసుకెళ్లి ఓటు వేయడానికి సహకరించారు. ఎస్పీ సత్యఏసుబాబు కదిరి ప్రాంతంలో పర్యటించారు.

పుట్టపర్తిలో అత్యధికం

గణాంకాలు

తొలి విడత 163 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 81.19 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 12 మండలాల్లో ఎన్నిక జరగగా.. పుట్టపర్తి పరిధిలో అత్యధికంగా 87.80 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా తలుపుల మండలంలో 75.85 శాతం నమోదైంది. పంచాయతీల వారీగా పరిశీలిస్తే.. నల్లచెరువు మండలం ఎం.అగ్రహారం పంచాయతీలో అత్యధికంగా 93.81 శాతం, అత్యల్పంగా కొత్తచెరువు మేజర్‌ పంచాయతీలో 70 శాతం ఓట్లు పోలయ్యాయి.

అందరికీ అభినందనలు

తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. పోలింగ్‌ 81.19 శాతం నమోదైందన్నారు. 12 మండలాల పరిధిలోని 169 పంచాయతీల్లో 3,43,420 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారిలో పురుషులు 1,72,031, మహిళలు 1,71,380, ఇతరులు 9 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. అందరూ బాగా పనిచేశారని కలెక్టరు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితోనే మిగిలిన ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్‌

నల్లమాడలో వృద్ధుడికి సహాయపడుతున్న కలెక్టర్‌

రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైందని కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం నల్లమాడలో పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. కేంద్రంలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. కదిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన 20 వేలమంది పైగా తమ గ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్‌ వివరించారు.

ఎన్నికల చిత్రాలు

ఇదీ చదవండి:పల్లె పోరు: వెలువడిన ఫలితాలు..సంబరాల్లో గెలిచిన అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details