అనంతపురం జిల్లా ఎదురూరు గ్రామానికి చెందిన పెద్దయ్య అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తప్పిపోయాడనుకున్న పెద్దయ్య.. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద కృష్ణా నదిలో శవమై తేలాడు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు.
పామిడి మండలం ఎదురూరుకు చెందిన పెద్దయ్య.. వివాహానికి ముందు నుంచి అదే గ్రామానికి చెందిన సుంకమ్మతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. సుంకమ్మ మేనమామ శంకర్.. పెద్దయ్య భార్య బాలక్కతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై పెద్దయ్య, శంకర్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఏమైనా చేస్తాడేమోనని పెద్దయ్య భార్య శంకర్కు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన శంకర్.. తానే పెద్దయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మాయమాటలు చెప్పి తన మేనకోడలు సుంకమ్మతో పెద్దయ్యకు ఫోన్ చేయించి పత్తికొండకు రప్పించాడు.
అక్కడే పథకం రూపొందించాడు..
పత్తికొండలో పెద్దయ్య హత్యకు పథకం రచించిన శంకర్.. మిత్రులు కుంటి శ్రీనివాస్, తుపాన్ డ్రైవర్ భాస్కరరెడ్డి సహకారం తీసుకున్నాడు. పెద్దయ్యతో మాట్లాడుతూనే టవల్ మెడకు బిగించి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పామిడి వద్ద పడేయాలనుకున్నాడు. అ మార్గంలో పోలీస్ చెకింగ్ ఉందని భాస్కరరెడ్డి చెప్పడంతో శవాన్ని తెలంగాణలోని బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో పడేయగా... ఇటిక్యాల వద్ద తేలింది.