ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎక్కడి పనులక్కడే - పడకేసిన పట్టణాభివృద్ధి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 4:05 PM IST

YSRCP Government Careless on Town Development in APపట్టణాలు, నగరాలు ఉపాధి కేంద్రాలు పల్లెల నుంచి ఎంతోమంది వలస వెళ్తుంటారు. అందుకే వేగంగా విస్తరిస్తుంటాయి. కానీ జగన్‌ పాలనలో వసతులు విస్తరించడం లేదు. సౌకర్యాల్లో ఏలోటూ రావొద్దని మాటలు చెప్పే జగన్‌ నిధుల విడుదల దగ్గరకు వచ్చేసరికి ఉత్తచేతులు చూపిస్తున్నారు. దీంతో గుత్తేదారులు పనులు మధ్యలో వదిలేసి వెళ్తున్నారు. జగన్‌ ఇలాకాతోపాటు రాష్ట్రంలో చేపట్టిన పట్టణాభివృద్ధి పనులన్నీ సగమైనా పూర్తికాకుండా వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వ కొంతమేర పూర్తిచేసిన పనులనూ పడకేయించిన జగన్‌ పట్టణాభివృద్ధిని అటకెక్కించారు.

YSRCP_Government_Careless_on_Town_Development
YSRCP_Government_Careless_on_Town_Development

YSRCP Government Careless on Town Development : తాగునీటి పథకమే పూర్తి చేసుంటే మహిళలకు ఆవేదన తప్పేది. గుంటూరులోని గోరంట్ల కొండపై ఉన్న కుటుంబాలకు తాగునీరు అందించేందుకు తక్కెళ్లపాడు తాగునీటి శుద్ధిప్లాంట్ నుంచి కొండపైకి పైపులైన్లు వేసి రిజర్వాయిర్‌కు అనుసంధానించాల్సి ఉంది. దీని ద్వారా అన్నపూర్ణనగర్, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు తీరతాయి. బ్యాలెన్సింగ్, సర్వీస్‌ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తైనా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకుసాగడం లేదు.

No Town Development in AP :అనకాపల్లికి శుద్ధజలాలు అందించేందుకు 2019లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 32 కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ఈపనులు నాలుగున్నరేళ్లు గడిచినా పూర్తి కాలేదు. 17 కిలో మీటర్లమేర పైపులైన్లు వేయాల్సి ఉంటే కేవలం 9 కిలో మీటర్ల పనులే పూర్తయ్యాయి. అనకాపల్లి పట్టణ ప్రజలకు ఈ పైపులైన్లలో వచ్చే శుద్ధజలాలు తాగే భాగ్యం ఇంకెన్నేళ్లకో.

పార్వతీపురంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన ప్రాజెక్టుదుస్థితి ఇది. 63కోట్ల 37లక్ష రూపాయల అంచనాతో ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. నాగావళి నదిలో ఇన్‌ఫిల్ట్రేషన్‌ బావులు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయిర్‌ నిర్మాణంతో పాటు 36 కిలో మీటర్ల పొడవునా పైపులైన్ల పనులు చేయాలి. అందులో 23 కిలో మీటర్ల మేర పైపులైన్లు వేశారు. గుత్తేదారు సంస్థకు 30 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో పనులు ఆపేశారు. నీళ్లేమోగానీ సగం తవ్వేసిన రోడ్లతో జనం తంటాలు పడుతున్నారు.

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఎర్రన్నాయుడు పార్కు - నాడు కళకళ, నేడు వెలవెల

ఆదోనిలోని మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ గడువు ప్రకారం ఈ ప్లాంట్‌ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ కనీసం20 శాతం పనులూ పూర్తి కాలేదు. ఎటుచూసినా ఇనుపచువ్వలే కనిపిస్తున్నాయి. ఇదే కాదు కర్నూలు, నంద్యాల మురుగునీరు శుద్ధి ప్లాంట్ల పనులూ నత్తనడకనే సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సరిగా విడుదల చేస్తే పనులు జోరుగా సాగేవి! పట్టణాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధ లేకపోవడంతో ఇవి ఇలా అసంపూర్ణంగా వెక్కిరిస్తున్నాయి.

సీఎం ఇలాకా కడపలోనూ అంతే! కడపలో రోజూ 28 మిలియన్‌ లీటర్ల నీటిని అదనంగా సేకరించి ప్రజలకు సరఫరా చేసేందుకు 68 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బావుల నిర్మాణ పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. 150 కిలో వాట్ల సామర్థ్యం గల మోటార్లు బిగించినా ప్రయోజం లేకుండా పడి ఉన్నాయి. ప్రభుత్వం నిధులు సరిగా విడుదల చేయని కారణంగా పనులు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇక సీఎం సొంత జిల్లాలోని రైల్వేకోడూరు ట్రాఫిక్‌ కష్టాలు తీర్చే అండర్‌పాస్‌ బ్రిడ్జికి అతీగతతీ లేదు. ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి గమ్మునున్నారు.

'అభివృద్ధి జరుగుతోంది అందరూ చప్పట్లు కొట్టండి' - 'అభివృద్ధా! అదెక్కడ?' మేయర్​పై వైసీపీ కార్పొరేటర్ల ధ్వజం

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రోడ‌్లు, కాలువలు, ఇతర వసతుల పనులు కోసం..గత ప్రభుత్వ హయాంలో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌-సీప్‌ కింద 25కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పైసా నిధులివ్వలేదు. ఫలితంగా పనులే ప్రారభించలేదు.

రాష్ట్రంలో పెద్ద నగరాలైన విశాఖ, విజయవాడ అభివృద్ధీ వైఎస్సార్సీపీ హయాంలో ఆరంభ శూరత్వంగానే మిగలింది. విజయవాడనగరాభివృద్ధి కోసం గత నాలుగున్నరేళ్లలో జగన్‌ రెండు విడతల్లో 150 కోట్ల రూపాయల గ్రాంట్‌ ప్రకటించారు. కాలువలు రోడ్లు, ఇతర పనులు చేసిన గుత్తేదారులు ఆ డబ్బుకోసం ఎదురు చూసి చివరకు అప్పులపాలయ్యారు. కొందరైతే బిల్లుల కోసం కోర్టులకు వెళ్లారు. విశాఖలో సాధారణ నిధులతో చేసిన పనులకు గతేడాది జులై నుంచి చెల్లింపుల్లేవు.

దాదాపు 150 కోట్ల రూపాయల వరకూ. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా బిల్లులు ఇవ్వకుండా, పనులు పూర్తిచేయకుండా పట్టణాభివృద్ధి ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి జగనే చెప్పాలి. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సమీక్షలో అధికారులకు సూచించడం వరకే పరిమితం కాకుండా పైసలు విడుదల చేయాలని పౌర సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

వంజంగి కొండలపై పర్యటకుల రద్దీ - సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details