ఆంధ్రప్రదేశ్

andhra pradesh

‘దురంతో’లో మహాలక్ష్మి పుట్టింది... కదులుతున్న రైలులో కాన్పు చేసిన వైద్య విద్యార్థిని

By

Published : Sep 14, 2022, 8:15 AM IST

Delivery in train: హైదరాబాదు నుంచి విజయనగరం వెళుతున్న ట్రైన్‌ లో నెలలు నిండక ముందే నొప్పుల రావటంతో ప్రసవం జరిగింది. పురిటి కోసం పుట్టింటికి రైల్లో బయలుదేరిన మహిళకు నొప్పులు రావడంతో ఓ వైద్య విద్యార్థిని పురుడు పోసి మానవత్వాన్ని చాటుకున్నారు. అసలేం జరిగిందంటే..?

Delivery in train
దురంతోలో ప్రసవం

Delivery in train: తెలతెలవారుతోంది... చల్లని గాలులతో వాతావరణం హాయిగా ఉంది... ప్రయాణికులతో నిండుకుండలా దురంతో రైలు దూసుకుపోతోంది. అంతలో కలకలం... రైలులో ప్రయాణిస్తున్న సత్యవతి అనే గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె భర్త సత్యనారాయణకు ఏం చేయాలో అర్థంకాలేదు. సాయం చేయాలని కనిపించిన వారినల్లా అడిగారు. అదే బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి స్పందించి సత్యవతిని పరీక్షించారు. తోటి మహిళల సహాయంతో పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది.

సోమవారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి విశాఖ బయల్దేరిన దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే కాన్పు అయింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు విశాఖ వెళ్లేదాకా ఎక్కడా హాల్ట్‌ లేదు. సత్యవతి పరిస్థితి గురించి టీటీఈ అందించిన సమాచారం మేరకు అనకాపల్లిలో స్టేషన్‌మాస్టర్‌ వెంకటేశ్వరరావు రైలును ఆపించారు. 108 అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను స్థానిక ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. గైనకాలజిస్టు అనూరాధ తల్లీబిడ్డకు వైద్యపరీక్షలు చేశారు. బిడ్డకు వైద్యసహాయం అందేవరకు స్వాతిరెడ్డి వారి వెన్నంటే ఉన్నారు. ఆమెకు సత్యవతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details