Power cuts Problems for jaggery industries: అనకాపల్లి జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు చెరకు పంట సాగు చేస్తుంటారు. మునగపాక, కశింకోట, అనకాపల్లి, అచ్చుతాపురం, ఎలమంచిలి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు మండలాల్లో సుమారు 52 వేల ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. గతంలో 80 శాతం పంటను చక్కెర కర్మాగారాలకు తోలేవారు. మిగతా 20 శాతం బెల్లం తయారీకి వినియోగించేవారు. క్రమంగా తుమ్మపాల, తాండవ, ఏటికొప్పాక చక్కెర ప్యాక్టరీలు ఒక్కోక్కటిగా మూతపడుతూ వచ్చాయి. దీంతో 80 శాతం పంటను బెల్లం తయారీకే ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో బెల్లం ధరలు అంతకంతకు పడిపోయాయని రైతులు చెబుతున్నారు. అయినా మరో ఉపాధి లేక బెల్లం తయారీని కొనసాగిస్తున్నామంటున్న రైతులు...ప్రస్తుతం విధిస్తున్న కరెంట్ కోతలతో అదీ నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
" రైతులకు 9 గంటల కరెంటు ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ గంట, రెండు గంటలు... అదీ రాత్రి పూట ఎప్పుడిస్తున్నారో తెలియడం లేదు. పంటలు పండటం లేదు. రేటు లేకపోయిన వేరే పని తెలియక, చేయలేక వ్యవసాయం చేస్తుంటే దానిని కూడా చేయనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సరైన స్పందన లేకపోతే... రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తగిన భారీ మూల్యం ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని రైతుల తరఫున హెచ్చరిస్తున్నాను."- చెరుకు రైతు