Women's day special : అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం కోటపాడుకు చెందిన వరహాలమ్మ పాడేరు ఆర్అండ్ బీ క్వార్టర్స్ రహదారి పక్కన గత నాలుగేళ్లుగా కొబ్బరి బొండాలు విక్రయిస్తోంది. ఆమెకు నలుగురు సంతానం. భర్త వేరే వివాహం చేసుకోవడంతో ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి పోషణ భారమంతా ఆమెపైనే పడింది. పిల్లలను పోషించుకునేందుకు తొలినాళ్లలో ఓ కంపెనీలో కూలి పనులు చేసింది. వాతావరణం పడకపోవడంతో గేదెలను పోషించి పాలు అమ్ముకుంది. గిట్టుబాటు కాకపోవడంతో ఆ తర్వాత వంట మహిళగానూ పనిచేసింది. ఆదాయం సరిపోకపోవడంతో కూరగాయలు అమ్మినా నిలదొక్కుకోలేని పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఆ మహిళ కుంగిపోలేదు. పిల్లలపై ఆమె ఆశలు.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలన్న అంచనాలు ఆమెను మరింతగా ప్రేరేపించాయి. చివరకు కొబ్బరి బొండాల వ్యాపారంతో దశతిరిగింది. ఆటో కొని సొంతంగా వ్యాపారం చేస్తూ బిడ్డల పెళ్లిళ్లు చేసింది.
బొండాల వ్యాపారంతో...తొలుత కొన్ని బొండాలు తీసుకొచ్చి అమ్మడంతో లాభం వచ్చింది. దాంతో రవాణా ఆటో మాట్లాడుకుని సరుకు తీసుకు వచ్చేది. రవాణా చార్జీలు అధికంగా ఉండడంతో అప్పుచేసి ఆటో కొనుగోలు చేసుకుంది. డ్రైవర్ తరచూ రాకపోవడంతో చివరకు తానే డ్రైవర్ అయింది. తన స్వగ్రామం మాడుగుల మండలం కోటపాడు సహా వడ్డాది చుట్టుపక్కల నుంచి బొండాలు కొనుగోలు చేసి ఆటో తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఘాట్ రోడ్డు వెంబడి పాడేరులోని తన దుకాణం వద్దకు చేర్చుకుంటుంది. సొంతంగా డ్రైవింగ్ చేయడం వల్ల తనకు అదనంగా వెయ్యి రూపాయలు మిగులుతున్నట్లు తెలిపింది.
తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు..గతంలో ఎన్నో అవస్థలు పడ్డానని.. అది గుర్తు చేసుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని వరహాలమ్మ చెప్తోంది. జీవితంలో ఎవరి సాయం తీసుకోకుండా ఓ మహిళగా తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. మగవాళ్లకు సైతం కష్టమయ్యే ఘాట్ రోడ్డులో.. వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి బొండాలతో ఆటో నడుపుతూ ముందుకు సాగుతోంది. మార్గంలో తనిఖీలు చేసే పోలీసులు, రవాణా శాఖ అధికారులు కూడా వరహాలమ్మ కష్టాన్ని చూసి వాహనాన్ని నిరభ్యంతరంగా వదిలేస్తారు. తగు జాగ్రత్తలు సూచనలు చెప్పి పంపించేస్తారు. ఓ మహిళ కుటుంబ పోషణ కోసం ఇలా ఆటో నడపడాన్ని సర్వదా హర్షిస్తున్నారు.