Vanjangi Tourists Suffer due to Lack of Facilities:అల్లూరి జిల్లా వంజంగి కొండలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నాలుగేళ్లుగా దినదినాభివృద్ధి సాధిస్తూ పర్యాటకంలో వంజంగి కొండలు ఓ మైలురాయిగా నిలిచాయి. సుధీర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యటకులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. తెల్లమంచు కప్పేసిన వేళ కొండల మాటున భానోదయాన్ని చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి చూపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్నారు. కానీ దీన్ని వీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ ఒక్క పూర్తిగా విఫలమయ్యాయి. స్థానికుల సాయంతో గేట్లు ఏర్పాటు చేసి ప్రవేశరుసుం మాత్రం వసూలు చేస్తున్నారు. కానీ సౌకర్యాలు విస్మరించారు. ఇంతటి అద్భుత ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వంజంగి కొండపై పర్యాటకుల సందడి - కనీస సౌకర్యాలు లేవని ఆందోళన
పారిశుద్ధ్యం పేరిట ఇటీవల వారం రోజుల పాటు సందర్శనను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు కానీ అంత అవసరం ఏమి వచ్చిందని స్థానిక నిర్వాహకులు పేర్కొంటున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే అత్యధిక రద్దీగా ఉంటుందని మిగిలిన రోజులు పారిశుద్ధ్య పనులు పెట్టుకోవచ్చు కదా అని చెబుతున్నారు. అక్కడకు వచ్చే పర్యటకులకు ఓ బాత్ రూమ్ సదుపాయం గానీ తాగునీటి సదుపాయం గానీ ఒక వ్యూ పాయింట్ గానీ నిర్మించలేకపోయారు. వంజంగి సూర్యోదయం తిలకించాలంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు వెళ్లాలి ఎక్కడ ఒక్క లైట్ కూడా ఉండదు, ఎత్తయిన బండ రాళ్ల మధ్యలో నాలుగు కిలోమీటర్ల నడక ప్రయాణంతో పర్యటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.