ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

ఈశ్వర్ మారూరి.. మన ఐరన్​ మ్యాన్ 'ఈత'డు! - ఐరన్​మ్యాన్ ఈశ్వర్ మారురి

మార్వెల్ సినిమాల్లో ఐరన్​మ్యాన్ చేసే విన్యాసాలను మనమంతా చూసే ఉంటాం. అతను చేసే సాహస కృత్యాలకు అబ్బురపడుతుంటాం. ఐరన్​మ్యాన్ అంటేనే సాహసానికి మరోపేరు. అలాంటి సాహసాలతో కూడుకున్న క్రీడే.. ఐరన్​మ్యాన్ ఈవెంట్.. కేవలం ఒక్క పూటలోనే  రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి విభాగాల్లో 226 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయాల్సిన క్రీడ ఇది. దానిని  అవలీలగా సాధించి.. ఐరన్ ​మ్యాన్​గా నిలిచాడు.. మన తెలుగబ్బాయి.. ఈశ్వర్ మారూరి.

ironman eshwar maruri

By

Published : Oct 16, 2019, 2:25 PM IST

Updated : Oct 16, 2019, 7:05 PM IST

ఐరన్​మ్యాన్ ఓ సాహస క్రీడ. స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్​లతో కూడిన ట్రయథ్లాన్ ఇది..!. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైక్లింగ్, 42.2 కిలోమీటర్ల పరుగు మొత్తంగా 226.3 కిలోమీటర్ల ఈవెంట్​ను 17 గంటల్లో ఎలాంటి విశ్రాంతి లేకుండా పూర్తి చేయాలి. వివిధ విభాగాల్లో సుదూర లక్ష్యాన్ని చేరుకునే క్రీడే ఈ ఐరన్​మ్యాన్. ప్రపంచ ట్రయత్లాన్ కార్పొరేషన్(డబ్ల్యూటీసీ) నిర్వహించే ఈ పోటీకి... ప్రపంచ కఠిన పోటీల్లో ఒకటిగా పేరు. ఒక్కరోజులో మూడు విభాగాల్లో పోటీపడుతూ గమ్యాన్ని చేరుకోవాలి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలో భాగంగా.. 2 గంటల 20 నిమిషాల్లో అంటే గం.9.20లకు ఈత ముగించాలి. సాయంత్రం గం.5.30 లోపు సైక్లింగ్, రాత్రి 12.00 లోపు పరుగు పూర్తి చేయగలగాలి. అలా విజయవంతమైతేనే.. అతణ్ని ఐరన్​మ్యాన్​గా ప్రకటిస్తారు. ఈశ్వర్ మారూరి.. ఈ మొత్తాన్ని కలిపి 12 గంటల 36 నిమిషాల్లోనే పూర్తి చేశారు. అక్టోబర్ 13న అమెరికాలో జరిగిన ఐరన్ మ్యాన్ లూస్ విల్లీస్ ఈవెంట్ లో ఈ ఘనత సాధించారు.

ఈశ్వర్ మారూరి.. మన ఐరన్​మ్యాన్ 'ఈత'డు!

ఈశ్వర్ మారూరి ప్రస్థానం

ఈశ్వర్ పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా చాగంటి వారిపాలెం. ప్రభుత్వ పాఠశాలలో, స్కాలర్​షిప్​ల సాయంతో చదువుకున్న ఈశ్వర్​కి చిన్నప్పటి నుంచీ సాహస క్రీడలంటే మక్కువ ఎక్కువ. ఈశ్వర్ ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో.. ఓ సాఫ్ట్​వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన... హైదరాబాద్​లో స్థిరపడ్డారు. అమెరికాలో జరిగిన ట్రయథ్లాన్​లో పాల్గొని ఐరన్​మ్యాన్ అనిపించుకున్నారు. భార్య రమాదేవి ప్రోత్సాహం ఆయనకు కొండంత అండగా నిలిచింది. రమాదేవి ఈశ్వర్ దంపతులకు అనఘ అనే కుమార్తె ఉంది.

సాహస క్రీడలపై ఆసక్తి చూపే ఈశ్వర్.. ఐరన్​ మ్యాన్ పోటీ కోసం నెలల తరబడి శిక్షణ తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్​లో ఈ పోటీ గురించి ఓ వీడియో చూశారట. ఇది ఎవరికీ సాధ్యపడదని అనుకున్నారు. తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. ఎలాగైనా ట్రయథ్లాన్ పూర్తి చేసి ఐరన్​మ్యాన్ అనిపించుకోవాలనుకున్నారు. నెలల పాటు కఠోర శ్రమతో అసాధ్యం అనుకున్న పోటీని పూర్తి చేశారు. అక్టోబర్ 13న అమెరికాలోని లూయిస్​విల్లీలో జరిగిన ఐరన్​మ్యాన్ పోటీలో పాల్గొన్న ఏకైన భారతీయుడుగా నిలవడమే కాక... ఈవెంట్​ను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత సాధించారు. 226 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల 36 నిమిషాల్లో ముగించి తెలుగు ఐరన్​మ్యాన్ అనిపించుకున్నారు. ఈశ్వర్ ఇప్పటి వరకూ 9 మారథాన్లు, 3 అల్ట్రా మారథాన్లు, 2 ఐరన్​మ్యాన్ 70.3 పోటీల్లో పూర్తిచేశాడు. 2018లో 70 మైళ్ల పెర్ఫార్మెన్స్​ను రెండుసార్లు విజయవంతంగా పూర్తి చేశారు.

''నన్ను నేను పరీక్షించుకోవడానికి ఎన్​డ్యూరెన్స్ క్రీడలను ఎంచుకున్నా. ఈ క్రీడల ద్వారా వీటి ఆవశ్యతకను పిల్లలకు తెలిపి, ఆటలతో ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలియజేస్తున్నా. పిల్లల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి ట్రైడర్స్ గ్రూపును స్థాపించాను. ఎన్జీవో సంస్థ సహకారంతో 'ఫిట్​నెస్ ఫర్ కాజ్​' అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న ట్రైడర్స్ గ్రూపుతో 20 లక్షల నిధులు సమీకరించాం. వీటిని పేదపిల్లల చదువుకు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చడానికి వినియోగిస్తున్నాం''.... ఈశ్వర్ మారూరి

స్వచ్ఛంద సేవలో..

ఈశ్వర్ స్వయంగా రెండు​ స్వచ్ఛంద సంస్థలను నడుపుతూ పేదవిద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. అడాప్ట్ చైల్డ్ ఆన్​లైన్​(ఏసీవో) అనే సంస్థను స్థాపించారు. పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులను ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. దాతలకు.. విద్యార్థులకు మధ్య ఏసీవో వారధిగా నిలుస్తోంది. ఇటీవలే ఏసీవో ద్వారా చదువుకున్న ఓ విద్యార్థి ఒరాకిల్​ ఉద్యోగం సాధించి, ఉన్నత స్థాయికి చేరాడు. ఈ విషయం తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఈశ్వర్ అన్నారు. సాహసక్రీడల్లో రాణించడమే కాక.. సేవాదృక్పథాన్ని చాటుకుంటూ రియల్ ఐరన్​మ్యాన్ అనిపించుకుంటున్నారు ఈశ్వర్​ మారూరి.

Last Updated : Oct 16, 2019, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details