నువ్వా నేనా అంటూ సాగిన నిర్ణయాత్మక మూడో టీ-ట్వంటీలో టీమిండియాపై కివీస్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ పట్టేయాలనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెన్ ఇన్ బ్లూ 208 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాట్స్మెన్ రాణించినా, బౌలర్లు విఫలమవడం ఓటమికి కారణమైంది.
"విజయ" దరహాసం..దక్కని విజయావకాశం..
ఈరోజు మ్యాచ్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది విజయ్ శంకర్. 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్న విజయ్ మరి కొంత సేపు ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది.
ఓపెనర్లలో రోహిత్ నెమ్మదిగా ఆడి 32 బంతుల్లో 38 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. 5 పరుగులే చేసిన ధావన్ మొదటి ఓవర్లలోనే వెనుదిరిగాడు.
వస్తూనే దంచుడు మొదలుపెట్టిన రిషభ్ పంత్ 12 బంతుల్లో 28 పరుగులు చేసి విజయంపై ఆశలు పెంచాడు. ఆల్రౌండర్ హర్దిక్ పాండ్య 21 పరుగులకే పరిమితమయ్యాడు. మాజీ సారధి ధోని రెండే పరుగులు చేసి ఔటయ్యాడు.
చివర్లో ధాటిగా ఆడిన దినేశ్ కార్తీక్(16 బంతుల్లో 33 పరుగులు), కృనాల్ పాండ్య(13 బంతుల్లో 26 పరుగులు) ఓటమి అంతరాన్ని తగ్గించారే తప్ప విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయారు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 11 పరుగులు మాత్రమే భారత్ సాధించగలిగింది.
కివీస్ ఓపెనర్స్ భళా..
టాస్ గెలిచిన భారత్ జట్టు కివీస్కు బ్యాటింగ్ అప్పగించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు సైఫర్డ్, మన్రో అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 80 పరుగులు జోడించారు. ముఖ్యంగా మన్రో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 40 బంతుల్లో 72 పరుగులు(5 ఫోర్లు, 5 సిక్స్లు) చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరో ఓపెనర్ సైఫర్డ్ 25 పరుగుల చేసి ఫర్వాలేదనిపించాడు. ధోని చేసిన కళ్లు చెదిరే స్టంపింగ్కు అతను పెవిలియన్ బాట పట్టాడు.
తర్వాత వచ్చిన విలియమ్సన్ 27 పరుగులు చేశాడు. ఆల్రౌండర్ గ్రాండ్ హోం 16 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోరు 200 దాటేందుకు సహాయపడ్డాడు.
భారత్ బౌలింగేనా ఇది...
గత మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్న కృనాల్ పాండ్య ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చాడు. పాండ్య బ్రదర్స్ ఇద్దరు కలిసి వికెట్లేమి తీయకుండా 98 పరుగులు ఇచ్చేశారు. తలో వికెట్ తీసిన భువనేశ్వర్(37/1), ఖలీల్ అహ్మద్(47/1) కూడా పరుగులు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్ కుల్దీప్ మాత్రమే రెండు వికెట్లు తీసి 26 పరుగులు ఇచ్చాడు.
4 పరుగుల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ గెలుపొంది 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
ఫిబ్రవరి 24 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీలు, ఐదు వన్డేలు ఆడనుంది టీమిండియా.