ఆక్రమణలు తొలగించే క్రమంలో కిరోసిన్ సిసాలు ఇన్స్పెక్టర్పై విసిరేయడమే కాకుండా, కారం చల్లి తీవ్రంగా గాయపరిచిన ఘటతో పోలీసు శాఖ ఉలిక్కిపడింది. ఇందుకు కారణమైన వారిని గుర్తించి కటకటాల్లోకి నెట్టింది. హైదరాబాద్ జవహర్నగర్లోని సర్వే నంబర్ 432/పీలో ఉన్న ఒకటిన్నర ఎకరాల ప్రభుత్వ భూమిని... విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మల్లేష్ అనే వ్యక్తి సాగు చేసుకోవడానికి గతంలో మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్కి ఆర్జీ పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తును కలెక్టర్ తిరస్కరించారు. కానీ మల్లేష్ ఆ భూమిని అక్రమంగా రాజస్థాన్కి చెందిన పూనం చంద్ కుమావత్ అనే వ్యక్తికి పవర్ ఆఫ్ పట్టా ఇచ్చాడు.
ఇదే భూమిలో 1500 చదరపు గజాల స్థలాన్ని మున్సిపల్ అధికారులు డంపిగ్ యార్డ్ కోసం వాడుతున్నారు. కొన్ని రోజులు క్రితం మేడ్చల్ కలెక్టర్ ఈ స్థలాన్ని మోడ్రన్ టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి వాడేందుకు నిర్ణయించారు. కానీ ఈ స్థలంలో పూనం చంద్ 900 గజాలు, రాగుల శేఖర్ 600 గజాల్లో షెడ్డులు ఏర్పాటు చేసుకొని వెదురు కర్రల వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులతో అధికారులు అక్కడికి వెళ్లారు.
ఇదీ జరిగింది..
కీసర ఆర్డీవో ఆదేశాల మేరకు... మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మ... ఈ నెల 24న పోలీసు బందోబస్తు నడుమ అక్కడికి చేరుకున్నారు. దీంతో పూనం చంద్తోపాటు పలువురు అక్కడికి వెళ్లి అధికారుల విధులను అడ్డుకున్నారు. అసభ్యంగా తిడుతూ అధికారులపై కారం చల్లారు. అదే క్రమంలో పూనం చంద్ కుమారుడు నిహాల్ చంద్, అతని భార్య శాంతి దేవి ఇంట్లో వెళ్లి గడియ పెట్టుకున్నారు. కిరోసిన్ సీసాలు అధికారులపైకి విసిరారు. ఇంట్లో ఉన్న దుస్తులను తగుల బెట్టి డ్రామా సృష్టించారు. ఇంట్లో నుంచి పొగలు రావటం గమనించిన ఇన్స్పెక్టర్ భిక్షపతి రావు మంటలు అంటించుకున్నారని భావించి లోపలికి వెళ్లేందుకు తలుపులు ధ్వంసం చేశారు. దీంతో కిరోసిన సీసాలకు నిప్పంటించి బిక్షపతిరావుపైకి విసిరారు.
ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. 40 శాతం కాలిన గాయాలతో ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ కమిషర్పై కూడా దాడికి ప్రయత్నించగా... ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 16మందిని అరెస్టు చేసి రిమాండ్కి తరించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:
తలుపులన్నీ మూసినా.. నెట్టుకొస్తారు