విజయవాడ నగరంలో సంచలనం రేపిన ఇంజనీరింగ్ విద్యార్ధిని హత్యకేసులో కొత్త కోణాలను వెలుగు చూస్తోంది. ఈ కేసును మాచవరం పోలీసు స్టేషన్ నుంచి విజయవాడ దిశ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి చర్చిలో తమ వివాహమైందని నాగేంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అక్కడికి ఓ బృందాన్ని, విద్యార్థిని కళాశాలకు మరో బృందాన్ని పంపించారు. కత్తిపోట్ల విశ్లేషణ, ఆమె పోస్టుమార్టం నివేదిక ఇంకా పోలీసులకు అందలేదు. దాడికి పాల్పడిన ఆయుధం పరిమాణాన్ని గమనించిన తర్వాతే కత్తిపోట్ల తీరు విశ్లేషించి తుది నివేదిక అందజేస్తామని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
నాగేంద్రబాబు ఆమె ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? అనే అంశాలు తేల్చటం పై పోలీసులు దృష్టి సారించారు. నిందితుడు కోలుకున్న తర్వాత విచారణ ద్వారా సమాచారం రాబట్టాలని చూస్తున్నారు. మరోవైపు విద్యార్థిని, నాగేంద్రబాబుల చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వాట్సాప్ సందేశాలు, సంభాషణల్ని విశ్లేషిస్తున్నారు. కొన్ని ఆడియోలు కూడా బయటకొచ్చాయి. ఈ ఏడాది మార్చి 28 న ఆమె చివరిసారిగా నాగేంద్రబాబుకు కాల్ చేయగా, ఏప్రిల్ 2 న నాగేంద్రబాబు ఆ విద్యార్థినికి కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.