ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఎనిమిది గంటలపాటు విచారణ.. తనకేం సంబంధం లేదన్న అఖిలప్రియ!

ప్రవీణ్​రావు అపహరణ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ.. రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. సుమారు ఎనిమిది గంటల పాటు ఆమెను ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. భూమా కుటుంబ సభ్యుల పాత్రపైనా లోతుగా ఆరాతీశారు. భార్గవరామ్‌ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

By

Published : Jan 12, 2021, 8:59 PM IST

akhilapriya arrest
అఖిలప్రియ అరెస్ట్

సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి అపహరణ కేసులో భూమా అఖిల ప్రియను వరుసగా రెండో రోజు పోలీసులు ప్రశ్నించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆమె న్యాయవాది సమక్షంలో విచారించారు. కిడ్నాప్‌ జరిగిన సమయంలో అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ ఎక్కడున్నారు.. పథకం రచించింది ఎవరు.. ఇతర కుటుంబ సభ్యుల పాత్రపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.

తనకు చాలా మంది ఫోన్​ చేస్తుంటారు..

అఖిల ప్రియ మాత్రం తనకు ఏమీ తెలియదని, ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కిడ్నాపర్ల నుంచి అఖిలప్రియకు వచ్చిన ఫోన్లపై దర్యాప్తు అధికారులు ఆరాతీయగా.. రాజకీయ నేతగా ఉన్న తనకు రోజూ ఎంతో మంది ఫోన్‌ చేస్తుంటారని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తర మండలం డీసీపీ కలమేశ్వర్‌ ఆధ్వర్యంలో ఆమెను విచారించారు.

జగత్​ విఖ్యాత్​రెడ్డి పాత్రపైనా..

అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డికి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అపహరణ జరిగిన సమయంలో అసలు ఆయన ఎక్కడున్నారు.. అని ఆరాతీస్తున్నారు. అపహరణ సమయంలో ఆయన చరవాణి సిగ్నల్స్​నూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కిడ్నాప్​ కేసులో మరికొంత మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం.. మరోసారి అఖిలప్రియను పోలీసులు విచారించనున్నారు.

ఇవీచూడండి:ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పిటిషన్.. విచారణ 18కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details