ఆకలికి తాళలేక ఓ వ్యక్తి మరణిస్తే.. అయినవారు కానరాక కొందరు నగరంలో బలవన్మరణాలకు పాల్పడారు. లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటించాడు ఓ వ్యక్తి (40). అంబర్పేట ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ కథనం ప్రకారం.. వడదెబ్బ కూడా తగలడంతో మృతిచెందాడు. అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం శవమై కనిపించాడు.
కుమారుడు రాలేదని తల్లి ఆత్మహత్య
విదేశాల్లో ఉన్న కుమారుడు లాక్డౌన్ వల్ల రాలేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోయిన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చిక్కడపల్లి వివేక్నగర్కు చెందిన లక్ష్మి, బాలరాజు దంపతుల కుమారుడు సతీష్కుమార్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చిలో హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపాడు. లాక్డౌన్ కారణంగా రాలేకపోవడంతో ఆ తల్లి బెంగ పెట్టుకుని బుధవారం తెల్లవారుజామున యాసిడ్ తాగి కూతురికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె వెంటనే వచ్చి తల్లిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
మానసిక వేదనతో వలస కార్మికుడు
మానసిక వేదనతో ఓ వలస కార్మికుడు ఉరేసుకున్నాడు. ఒడిశాకు చెందిన పింకు రియాల్(21) పంజాగుట్టలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. వసతి గదిలో ఉంటున్నాడు. బుధవారం ఉదయం గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని కన్పించాడు. మానసిక స్థితి సరిగా లేదని తోటి కార్మికులు తెలిపారు.