యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ గురించి అంతా తెలిసే విదేశీ విద్యార్థులు నేరానికి పాల్పడ్డారని అమెరికా అధికారులు బదులిచ్చారు. ఈ నకిలీ విశ్వవిద్యాలయం వ్యవహారంలో భారత విద్యార్థులు పట్టుబడిన సంగతి తెలిసిందే. భారత దౌత్య అధికారులు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించగా ఈ విషయం తేలింది.
" పట్టుబడ్డ 130 మంది విదేశీ విద్యార్థులకు వారు చేస్తున్న నేరం గురించి తెలుసు. ఉన్నత విద్యకోసం నమోదు చేసుకున్న విశ్వవిద్యాలయం నకిలీదనీ వారికి ముందే తెలుసు. అమెరికాలో ఉండాలన్న కోరికతోనే ఈ చర్యకు పాల్పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్లో ఉపాధ్యాయులు లేరని, తరగతులు జరగవని ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారందరికీ తెలుసు. అన్నీ తెలిసే వారందరూ ఈ నేరంలో భాగస్వాములయ్యారు."
- అమెరికా అధికార ప్రతినిధి
'అమెరికా' ఆశతో వల
విద్యార్థులకు తక్కువ బోధనా రుసుముతో పాటు కళాశాలలో పేరు నమోదుచేసుకున్న వెంటనే చదువుకుంటూ పనిచేసుకునేందుకు అనుమతులను కల్పించింది యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్. దాదాపు 600 మంది విద్యార్థులు ఇందులో చేరగా అందులో ఎక్కవమంది భారతీయులే.