ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఆగని రుణయాప్​ల వేధింపులు.. గాల్లో కలిసిపోతున్న బాధితుల ప్రాణాలు - loan apps harassments in palnadu

YOUNG MAN SUICIDE: రుణయాప్​ల పేరు వింటేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ కంపెనీల నుంచి ఫోన్లు వస్తే చాలు చనిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. కనీసం రోజుకొకరైనా రుణయాప్​ల వేధింపులు తాళలేక.. వారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. దీనిపై సైబర్​ క్రైమ్​ అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారిని ఏలా పట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. నిన్న రాజమండ్రిలో వేధింపులు తాళలేక దంపతుల ఆత్మహత్య మరువకముందే తాజాగా పల్నాడులో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

suicide due to loan apps harassment
suicide due to loan apps harassment

By

Published : Sep 9, 2022, 3:48 PM IST

Updated : Sep 9, 2022, 8:09 PM IST

Loan Apps Harassment : రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల వేధింపులకు మరొకరు బలయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శివ.. గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఆన్‌లైన్‌లో రుణయాప్‌ సంస్థ నుంచి 3 వేల రూపాయలు అప్పుగా తీసుకుని.. ఇప్పటివరకు 20 వేల రూపాయల వరకు చెల్లించాడని మృతుని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినా.. ఇంకా అప్పు ఉందని.. కట్టకపోతే.. కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగుతానని బెదిరించారని ఆరోపించారు. వారి వేధింపులు భరించలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆగని రుణయాప్​ల వేధింపులు.. గాల్లో కలిసిపోతున్న బాధితుల ప్రాణాలు

నిన్న రాజమండ్రిలో..:అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మితో వివాహమైంది. నగరంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్‌, రమ్యలక్ష్మి టైలరింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్‌ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు. ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ చిత్రంతోపాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు. దాంతో గుండెపగిలిన దంపతులు, నిస్సహాయస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 9, 2022, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details