ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Cyber Crime: సహకార బ్యాంక్‌లో రూ. 1.96కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్‌ - తెలంగాణ వార్తలు 2021

తెలంగాణ సహకార బ్యాంక్‌లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసులో... ప్రధాన సూత్రధారి విల్సన్‌ అనే నైజీరియన్ అని పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌కు విద్యా, ఉపాధి కోసం వచ్చిన నైజీరియన్‌ విల్సన్‌... తెలంగాణ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ సర్వర్‌ భద్రత బలహీనంగా ఉందని తెలుసుకుని దానిపై దాడి చేసి డబ్బులు దోచేశాడు. బ్యాంకు అధికారులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. విషయం వెలుగుచూసింది.

money
money

By

Published : Jul 16, 2021, 8:01 AM IST

హైదరాబాద్‌ కోఠిలోని తెలంగాణ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకులో చోటుచేసుకున్న సైబర్‌ మోసంలో పాత్రధారులు, సూత్రధారులు బయటపడుతున్నారు. ఈ బ్యాంకు నుంచి రూ.1.96 కోట్లు కొల్లగొట్టింది నగరంలోని టోలిచౌకీలో ఉంటున్న నైజీరియన్‌గా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చదువు కోసం రెండేళ్ల క్రితం వచ్చిన నైజీరియన్‌ విల్సన్‌ ఐటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న ఈ బ్యాంకుపై కన్నేశాడు. ఈనెల 7న దాని సర్వర్లలోకి ప్రవేశించాడు. వెస్ట్రన్‌ మనీలో పనిచేసిన యాసిన్‌ బాషాను పరిచయం చేసుకున్నాడు. పద్మారావునగర్‌లో ఉంటున్న యువతితో కో-ఆపరేటివ్‌ బ్యాంకు సికింద్రాబాద్‌ శాఖలో ఈనెల 2న ఒక ఖాతాను యాసిన్‌, అతడి సోదరుడు మహ్మద్‌ రఫీతో 12న చందానగర్‌ శాఖలో మరో రెండు అకౌంట్‌లను తెరిపించి స్వాహా పర్వాన్ని సాగించాడు. బుధవారం బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ బి.రమేష్‌ దర్యాప్తు చేపట్టడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి. యాసిన్‌ బాషా, మహ్మద్‌ రఫీలను గురువారం అరెస్ట్‌ చేశారు. విల్సన్‌, మరో యువతి పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.

పది శాతం కమీషన్‌

కొల్లగొట్టే సొమ్మును మూడు ఖాతాలకు మళ్లించాలని నైజీరియన్‌ విల్సన్‌ నిర్ణయించాడు. ఈనెల 7న సాయంత్రం నుంచి బ్యాంకు నుంచి యువతి ఖాతాలోకి నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా దఫదఫాలుగా రూ.1.94 కోట్లు జమచేశాడు. రఫీ ఖాతాలో 12వ తేదీ ఉదయం రూ.2 లక్షలు బదిలీ చేశాడు. యాసిన్‌ అకౌంట్‌లో వంద రూపాయలు వేసి మళ్లీ వెనక్కు తీసేసుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం యువతి ఖాతాలోని నగదును హరియాణ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలోని జాతీయ, కార్పొరేట్‌, ప్రైవేటు బ్యాంకుల్లోని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. రఫీకి వాట్సప్‌ సందేశం పంపించి రూ.2 లక్షలు తీసుకురావాలన్నాడు. అతడు ఆ రూ.2 లక్షలను హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలోకి బదిలీ చేసి, విత్‌డ్రా చేశాడు. సోమవారం మధ్యాహ్నం విల్సన్‌కు అందజేశాడు. ఇలా చేసినందుకు రఫీ రూ.20 వేలు కమీషన్‌ తీసుకున్నాడు.

నగదు లావాదేవీల పరిమితి రూ.6 కోట్లకు

ఈనెల 7న ప్రధాన సర్వర్‌లోకి సులువుగా ప్రవేశించిన విల్సన్‌ ఖాతాదారులకు నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ఒక రోజులో నగదు బదిలీ చేసేందుకు.. అలాగే డిపాజిట్‌ స్వీకరించేందుకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలని గుర్తించాడు. సాఫ్ట్‌వేర్‌ను మార్చి తమ మూడు ఖాతాల పరిమితిని రూ.6 కోట్లకు పెంచాడు. ఈనెల 12న అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా, చందానగర్‌, సికింద్రాబాద్‌లోని మూడు ఖాతాలకు ప్రధాన శాఖ నుంచి డబ్బు బదిలీ అయినట్టు గుర్తించారు. వాటి నుంచి మరో 102 ఖాతాలకు మళ్లించినట్లు తెలుసుకున్నారు.

పుణె కాస్మోస్‌ బ్యాంకు తరహాలో..

పుణెలోని ప్రముఖ కాస్మోస్‌ సహకార బ్యాంకులో మూడేళ్ల క్రితం సైబర్‌ నేరస్థులు మాల్‌వేర్‌ను పంపించి వివిధ శాఖల ఖాతాల్లోని రూ.94 కోట్లు కొల్లగొట్టి దేశ, విదేశాల్లోని ఖాతాలకు బదిలీ చేశారు. మూడురోజుల పాటు సర్వర్లను గుప్పిటపట్టారు. ప్రత్యేక పోలీస్‌ బృందం పరిశోధించి 20 మందిని అరెస్ట్‌ చేసి.. రూ.10 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకుంది. దక్షిణ కొరియా దేశస్థులతో పాటు కెనడాకు చెందిన సైబర్‌ నేరస్థులు తెరవెనుక ఉన్నారని అనుమానించారు. విల్సన్‌ ఇదే తరహాలో నగదు బదిలీ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత కథనం:WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...

ABOUT THE AUTHOR

...view details