హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో చోటుచేసుకున్న సైబర్ మోసంలో పాత్రధారులు, సూత్రధారులు బయటపడుతున్నారు. ఈ బ్యాంకు నుంచి రూ.1.96 కోట్లు కొల్లగొట్టింది నగరంలోని టోలిచౌకీలో ఉంటున్న నైజీరియన్గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చదువు కోసం రెండేళ్ల క్రితం వచ్చిన నైజీరియన్ విల్సన్ ఐటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న ఈ బ్యాంకుపై కన్నేశాడు. ఈనెల 7న దాని సర్వర్లలోకి ప్రవేశించాడు. వెస్ట్రన్ మనీలో పనిచేసిన యాసిన్ బాషాను పరిచయం చేసుకున్నాడు. పద్మారావునగర్లో ఉంటున్న యువతితో కో-ఆపరేటివ్ బ్యాంకు సికింద్రాబాద్ శాఖలో ఈనెల 2న ఒక ఖాతాను యాసిన్, అతడి సోదరుడు మహ్మద్ రఫీతో 12న చందానగర్ శాఖలో మరో రెండు అకౌంట్లను తెరిపించి స్వాహా పర్వాన్ని సాగించాడు. బుధవారం బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ బి.రమేష్ దర్యాప్తు చేపట్టడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి. యాసిన్ బాషా, మహ్మద్ రఫీలను గురువారం అరెస్ట్ చేశారు. విల్సన్, మరో యువతి పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.
పది శాతం కమీషన్
కొల్లగొట్టే సొమ్మును మూడు ఖాతాలకు మళ్లించాలని నైజీరియన్ విల్సన్ నిర్ణయించాడు. ఈనెల 7న సాయంత్రం నుంచి బ్యాంకు నుంచి యువతి ఖాతాలోకి నెట్బ్యాంకింగ్ ద్వారా దఫదఫాలుగా రూ.1.94 కోట్లు జమచేశాడు. రఫీ ఖాతాలో 12వ తేదీ ఉదయం రూ.2 లక్షలు బదిలీ చేశాడు. యాసిన్ అకౌంట్లో వంద రూపాయలు వేసి మళ్లీ వెనక్కు తీసేసుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం యువతి ఖాతాలోని నగదును హరియాణ, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలోని జాతీయ, కార్పొరేట్, ప్రైవేటు బ్యాంకుల్లోని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. రఫీకి వాట్సప్ సందేశం పంపించి రూ.2 లక్షలు తీసుకురావాలన్నాడు. అతడు ఆ రూ.2 లక్షలను హెచ్డీఎఫ్సీ ఖాతాలోకి బదిలీ చేసి, విత్డ్రా చేశాడు. సోమవారం మధ్యాహ్నం విల్సన్కు అందజేశాడు. ఇలా చేసినందుకు రఫీ రూ.20 వేలు కమీషన్ తీసుకున్నాడు.