ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2021, 8:14 AM IST

ETV Bharat / crime

బెంగళూరులో తీగ లాగితే.. తెలంగాణలో కదిలిన డొంక!

స్థిరాస్తి వ్యాపారం.. రాజకీయం.. సినిమా వారితో పరిచయాలు.. లావాదేవీల్లో మిత్రులైన పక్క రాష్ట్రాల వారితో పార్టీలు.. వాటిలో డ్రగ్స్‌ వినియోగం.. వెరసి అదో ప్రపంచం. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ మత్తు రొంపిలో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంలో చిన్నస్థాయి తెలుగు హీరో కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. బెంగళూరులో పోలీసులకు చిక్కిన డ్రగ్స్‌ సరఫరా ముఠా వద్ద తీగ లాగితే అది తెలంగాణకూ పాకినట్లు తేలింది. అనుమానితులు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి కొందరికి సరఫరా చేసినట్లు సమాచారం.

drugs
drugs

ర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల కేసులో తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పేరు నిర్ధారణ కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకూ సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన మత్తుమందు పార్టీల్లో కూడా వీరు పాల్గొన్నారని, తాను తెలంగాణ ఉద్యమకారుడినంటూ బెంగళూరు పోలీసులకు చెప్పుకున్న ఓ వ్యక్తి వీటిని సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఓ కన్నడ నటుడికి చెందిన బెంగళూరు హోటల్లో జరిగే మత్తు పార్టీలకు కూడా వీరు తరచూ హాజరయ్యేవారని తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక చిన్నపాటి తెలుగు సినీ హీరోను రెండు రోజులపాటు విచారించి కీలక సమాచారం సేకరించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత అనుమానిత ఎమ్మెల్యేలను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బయటపడింది ఇలా...

ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్‌ పోలీసులు నవగరా సర్వీసు రోడ్డులో సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన హారిసన్‌, జాన్‌నాన్సోలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 4 కోట్ల విలువైన 350 గ్రాముల ఎండీఎంఏ గుళికలు, 4 గ్రాముల కొకైన్‌, 82 ఎక్స్‌టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దర్నీ విచారించినప్పుడు తమతోపాటు మత్తుమందులు సరఫరా చేస్తున్న నైజీరియాకే చెందిన ఉస్మాన్‌, లోకొండోల పేర్లు వెల్లడించారు. పోలీసుల గాలింపులో లోకొండో పట్టుబడ్డాడు. అతని నుంచి 526 ఎల్‌ఎస్డీ స్ట్రిప్స్‌, 200 గ్రాముల కొకైన్‌, 2.7 కిలోల ఎండీఎంఏ, 1,930 ఎక్స్‌టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో జాన్‌నాన్సో మరికొందరు ప్రముఖుల పేర్లు చెప్పాడు. అందులో మస్తాన్‌చంద్ర అనే వ్యక్తిపేరు ఉంది. కన్నడ సినీ పరిశ్రమకు చెంది, అక్కడ బిగ్‌బాస్‌-4లో పాల్గొన్న మస్తాన్‌చంద్రను విచారించినప్పుడు తాను, కేశవ్‌ అనే మరో వ్యక్తి కలిసి పబ్బులు, హోటళ్లు, రిసార్టులు, అపార్ట్‌మెంట్లలో మత్తుమందు పార్టీలు నిర్వహిస్తామని వెల్లడించాడు.

మస్తాన్‌చంద్ర బెంగళూరులో శంకరగౌడ అనే సినీ నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి నిర్వహించిన పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేశాడు. దాంతో శంకరగౌడ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారం కూడా నిర్వహించే శంకరగౌడ బెంగళూరులో ఇచ్చిన మత్తు పార్టీలలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేతో పాటు ఇంకొందరు పాల్గొన్నారు. ఆ పరిచయంతో హైదరాబాద్‌లో జరిగిన పార్టీలకు కూడా శంకరగౌడ ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తేలింది. పోలీసులు వీటికి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్‌లు సంపాదించినట్లు తెలుస్తోంది.

ఇలా కలిసింది

హైదరాబాద్‌ వ్యాపారి సందీప్‌రెడ్డిని బెంగళూరు పోలీసులు ఇటీవల విచారించారు. సందీప్‌రెడ్డి, సికింద్రాబాద్‌కు చెందిన మరో వ్యాపారి కలహార్‌రెడ్డి మిత్రులు. కలహార్‌రెడ్డికి కన్నడ సినీ పరిశ్రమలో పరిచయాలు ఉండడంతో సందీప్‌రెడ్డిని కన్నడ నిర్మాత శంకరగౌడకు పరిచయం చేశాడు. బెంగళూరులో కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయని, ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఉంటే చెప్పమని శంకరగౌడ కోరడంతో సందీప్‌రెడ్డి తనకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేతోపాటు మరికొందర్ని తీసుకొని బెంగళూరు వెళ్లాడు. అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈవెంట్‌ నిర్వాహకుడు విక్కీ మల్హోత్రా, డేనియల్‌, మస్తాన్‌చంద్ర ఈ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో మత్తుమందులు సరఫరా చేశారు.

తర్వాత 2019 ఆగస్టులో శంకరగౌడ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పార్టీకి సందీప్‌రెడ్డి, ఓ చిన్నపాటి తెలుగు హీరో, ఎమ్మెల్యేతోపాటు ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తి, హాజరయ్యారు. తిరిగి హైదరాబాద్‌ వచ్చేటప్పుడు శంకరగౌడ నుంచి ఉద్యమకారుడు కొకైన్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌ శివారులోని ఫామ్‌హౌస్‌లలో జరిగిన పార్టీలకు కూడా అతడే బెంగళూరు నుంచి మత్తుమందులు తీసుకొచ్చాడని, ఈ పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనేవారని, దాంతోపాటు మత్తుపార్టీల కోసం తరచూ బెంగళూరు వచ్చేవారని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా వారిచ్చిన సమాచారం ఆధారంగా అనుమానిత ఎమ్మెల్యేలను విచారించనున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు దొరికినట్లు, ఒకటి రెండురోజుల్లో ఆయనకు నోటీసులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. అనుమానితుల్లో ఒకరైన మస్తాన్‌చంద్ర అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడని తెలిసింది.

ఏ క్షణమైనా అరెస్ట్‌?

వారంక్రితం బెంగళూరు నుంచి వచ్చిన పోలీసు బృందం కలహార్‌రెడ్డితోపాటు ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కాని వారిద్దరూ హాజరు కాలేదు. పోలీసులు రక్తనమూనాలను సేకరించి పరీక్షిస్తే తాము డ్రగ్స్‌ తీసుకున్న విషయం తెలిసిపోతుందనే భయంతో వారు కావాలనే జాప్యం చేస్తున్నారని, రక్తంలో ఆనవాళ్లు దొరక్కుండా చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దాంతో వీరిద్దరినీ అరెస్టు చేసేందుకు బెంగళూరు నుంచి పోలీసు బృందం హైదరాబాద్‌ రానున్నట్లు సమాచారం.

క్యాబ్‌ల ద్వారా డ్రగ్స్‌ రవాణా:

ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తికి హైదరాబాద్‌లో క్యాబ్‌ల వ్యాపారం ఉంది. కలహార్‌రెడ్డితో కలిసి సినిమాలకు ఫైనాన్స్‌ కూడా చేసేవాడు. తన క్యాబ్‌లు ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ చేరవేస్తున్నట్లు, ప్రతి నెలా బెంగళూరులో పార్టీ ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నుంచి ప్రముఖులను తీసుకెళ్లేవాడని పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

స్టార్ క్యాంపెయినర్లతో వేడెక్కనున్న తిరుపతి లోక్​సభ ఉపపోరు

ABOUT THE AUTHOR

...view details