కృష్ణా జిల్లాలో...
- విజయవాడకు చెందిన నలుగురు యువకులు కర్ఫ్యూ సమయంలో ఆటోలో మద్యం తాగి తిరుగుతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు రోడ్ చుట్టుగుంట వద్ద అనుమానం వచ్చి పోలీసులు ఆటోను ఆపి తనిఖీ చేయగా.. విషయం బయటపడింది. పట్టుబడిన నలుగురు యువకుల్లో రైల్వే పార్సిల్ సిబ్బంది ఒకరు ఉన్నారు. వారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- విజయవాడ నగర శివారులో నిషేధిత గుట్కా నిల్వల గోడౌన్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపుదాడులు చేశారు. ప్రసాదంపాడు జమ్మి చెట్టు బజార్ లో గృహంలో నిల్వ ఉంచిన 2.13 లక్షల రూపాయల విలువైన గుట్కా, సిగరెట్లు.. పటమట కనక దుర్గా నగర్ లో రూ. 2.35 లక్షల విలువైన నిషేదిత గుట్కాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
గుంటూరు జిల్లాలో...
- తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో.. పోలీసులు దాడులు నిర్వహించారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. లారీ క్లీనర్ సహాయంతో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించామని సీఐ శేషగిరిరావు తెలిపారు. 117 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
- చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలోని వీవర్స్ కాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన 17 వేల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 60 వేలు ఉంటుందనీ ఎస్సై రమేష్ తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
- చిలకలూరిపేట పట్టణం పండరీపురం అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై రూరల్ ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాలు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించాయి. పేకాడుతున్న 33 మంది జూదరులను అరెస్టు చేశారు. రూ. 13.3 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రకాశం జిల్లాలో...
- వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 87 క్వార్టర్ బాటిల్స్, 2 ఫుల్ బాటిల్స్, 27 బీర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
కర్నూలు జిల్లాలో...
- కర్నూలు జిల్లా గూడూరు స్టేషన్ పరిధిలోని సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ మద్యం తరలింపును పోలీసులు గుర్తించారు. గూడూరు మండలం మల్లపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 1033 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని ఎస్సై నాగార్జున తెలిపారు.
- కోడుమూరు, గూడూరు పట్టణంలో ఆదివారం పోలీసులు విస్తృత దాడులు చేశారు. కోడుమూరుకు చెందిన సజ్జన గాండ్ల దీపక్, షరీఫ్ పాషా నుంచి రూ.1,34,090 విలువచేసే 11,760 నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎస్ఐ వేణుగోపాల్ స్వాధీనం చేసుకున్నారు. గూడూరులో పుల్లయ్య అనే వ్యక్తి నుంచి రూ.10,400 విలువచేసే 3,500 గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.
- బనగానపల్లి పట్టణం కొండపేటలోని చక్రవర్తి ఫంక్షన్ హాల్ సమీపంలో.. పోలీసులు దాడులు చేశారు. గుట్కా ప్యాకెట్లతో పాటు.. 96 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.19 లక్షలు ఉంటుందని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.