అధిక వడ్డీ పేరుతో దాదాపు కోటి రూపాయలు కుచ్చుటోపీ పెట్టి ఓ వ్యక్తి పరారైన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్వతి నగర్లోని శ్రీ గురు ఫైనాన్లో పనిచేస్తున్న శ్రీనివాసులు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి గత కొంత కాలంగా అవసరాల కోసం డబ్బులు తీసుకోవడం ఇవ్వడం లాంటి లావాదేవీలు చేస్తూ వచ్చాడు. ఇలా దాదాపు పట్టణంలోని కొందరి వద్ద అప్పులు చేశాడు. కొన్ని రోజుల నుంచి డబ్బులు తిరిగి చెల్లించకపోగా.. తాజాగా ఇంటి నుంచి కుటుంబంతో సహా ఉడాయించాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
అబద్దాలు చెప్పి అప్పులు..
ఇంటి నిర్మాణం కోసమంటూ కొందరి వద్ద, కుమారుని ఉద్యోగం కోసమంటూ చెప్పి మరి కొంతమంది దగ్గర దాదాపు కోటి రూపాయల వరకు అప్పులు చేశాడు. కొందరి వద్ద ఏకంగా ఇంటి పత్రాలను కలర్ జిరాక్స్ చేసి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మరి కొందరికి ప్రామిసరీ నోటు రాసిచ్చి అప్పు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసమంటూ పట్టణంలోని సుశీలమ్మ వద్ద రూ.3.80లక్షలు, కుమారుని ఉద్యోగం కోసమంటూ శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు ఇలా దాదాపు 50, 60 మంది వద్ద సుమారు కోటి రూపాయలు అప్పులు చేసి పరారయ్యాడు.