ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోడు భూముల కేసు: బిడ్డల తోడుగా.. తల్లులు జైలు పాలు!

అమ్మ ఒడిలో నిద్రిస్తున్న చిన్నారులు.. వారికి పాలిస్తున్న ఆ తల్లులూ.. అంతా జైలుపాలయ్యారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ పోడు భూముల వివాదానికి సంబంధించిన కేసులో.. 9 మంది మహిళలు జైలుపాలయ్యారు. అందులో ముగ్గురు చంటిపిల్లల తల్లులు ఉన్నారు.

By

Published : Aug 7, 2021, 9:28 AM IST

Published : Aug 7, 2021, 9:28 AM IST

jailed-children
jailed-children

అమ్మ ఒడిలో హాయిగా నిద్రించాల్సిన పసి మొగ్గలు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పోడు భూముల కేసులో న్యాయస్థానంలో తమ తల్లులతో పాటు గంట పాటు నిరీక్షించారు. గుక్కపెట్టి ఏడ్చారు. చివరికి తల్లులతో పాటే జైలుకు వెళ్లారు. సాక్షాత్తూ తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంలో శుక్రవారం ఖమ్మం కోర్టు ఆవరణలో ఈ దృశ్యం కనిపించింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌ పోడు భూములకు సంబంధించి అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కొందరిని గురువారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం మరో 9 మంది మహిళలను నిందితులుగా పేర్కొంటూ జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇందులో ముగ్గురు చంటి పిల్లల తల్లులు ఉన్నారు.

శిశువులను ‘మిల్క్‌బేబీ’గా..

వారిలో ఎత్తెర మౌనికకు 3 నెలల శిశువు, ఆలపాటి కవితకు 8 నెలల శిశువు ఉన్నారు. మరో మహిళ రాణికి ఏడాది వయసున్న చంటి పాప ఉంది. ఈ ముగ్గురు తల్లులతోపాటు మరో ఆరుగురు మహిళలను పోలీసులు ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులైన తల్లులతోపాటు నెలల వయసున్న శిశువులను దానవాయిగూడెంలోని జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌ రిపోర్టులో శిశువులను ‘మిల్క్‌బేబీ’గా పేర్కొన్నారు.

చంటి పిల్లల తల్లులపైనా పోడు కేసులా...?

పోడు భూముల స్వాధీనం పేరుతో అటవీ శాఖ అధికారులు చంటి పిల్లల తల్లులపైనా కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఈ మేరకు వారు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చూడండి:

మళ్లీ తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

ABOUT THE AUTHOR

...view details