తెలంగాణలోని హైదరాబాద్ గుల్షన్ - ఎ - ఇక్బాల్ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ (37) ఓ న్యూస్ ఛానల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎంబీటీ నేత సలీం కొద్దిరోజులుగా ఆమెపై అసభ్యకర వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు.
మానసిక ఒత్తిడికి గురైన ఖాద్రీ శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్లగా కుటుంబ సభ్యులు ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. తన తల్లి పరిస్థితికి సలీం కారణమని నాహీదా కూతురు శనివారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రుద్రభాస్కర్ ఆదేశాల మేరకు డీఐ కె.ఎన్.ప్రసాద్వర్మ కేసు నమోదు చేసి, సలీంను అరెస్టు చేశారు. అతణ్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియడంతో వందల సంఖ్యలో మజ్లిస్ కార్యకర్తలు ఠాణా వద్దకు వచ్చి ఆయనపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.