CBI Notices to YSRCP Councilor: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసులో తాజాగా సీబీఐ ఓ మహిళ సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. వీరిని సోమవారం రాత్రి విజయవాడలోని సీబీఐ కేసులను విచారించే ఐదో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచారు. నరసరావుపేటకు చెందిన ప్రదీప్కుమార్రెడ్డి, కుంచనపల్లివాసి అశోక్కుమార్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన రంగారావు, నంబూరు గ్రామస్థురాలైన పి.సుమ, ప్రకాశం జిల్లా గురజపేటకు చెందిన గంజికుంట మల్లికార్జునరావు, పొదిలికి చెందిన రామాంజనేయులురెడ్డి, హైదరాబాద్ వాసి చొక్కా రవీంద్రలను అధికారులు అరెస్టు చేశారు. వీరిని పిలిపించి ప్రశ్నించినా విచారణకు సహకరించడం లేదని, దీంతో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. అంతకు ముందు వీరికి ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. సీబీఐ అధికారులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను విశ్లేషణ నిమిత్తం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే న్యాయమూర్తుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని సీబీఐ కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదికలో తెలిపింది. న్యాయమూర్తులను ఉద్దేశపూర్వకంగా కించపరచడం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీన్ని వెలికితీసేందుకు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మారుతిరెడ్డికి సీబీఐ నోటీసులు - cbi enquiry on ysrcp councilor
18:09 September 12
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడిగా మారుతిరెడ్డి
హిందూపురానికి వచ్చిన సీబీఐ అధికారులు
హిందూపురం, న్యూస్టుడే: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ అధికారులు వస్తున్నారని ముందస్తు సమాచారం అందడంతో నిందితుడైన వైకాపా నాయకుడు, 21వ వార్డు కౌన్సిలర్ మారుతీరెడ్డి పరారయ్యారు. దాంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఈ కేసులో విచారణకు విజయవాడకు రావాలని మారుతీరెడ్డికి రెండుసార్లు నోటీసులు పంపారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు చేయడానికి ఆరుగురు సీబీఐ అధికారులు సోమవారం హిందూపురానికి వచ్చారు. రెండో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లుతో చర్చించి, స్థానిక పోలీసులతో కలిసి సాయంత్రం మారుతీరెడ్డి ఇంటికి వెళ్లారు. మారుతీరెడ్డి లేకపోవడంతో ఆయన భార్యతో మాట్లాడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
ఇవీ చదవండి: