ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 29, 2021, 1:51 PM IST

ETV Bharat / crime

Bike Theft: 9 ఏళ్ల క్రితం పోయిన బైకుకు చలానా.. నిర్లక్ష్యమే పోలీసుల సమాధానమా?

కష్టార్జితంతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైక్​ తొమ్మిదేళ్ల క్రితం మాయమై​​.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. హైదరాబాద్​ రోడ్ల మీద రయ్​రయ్​మంటూ చక్కర్లు కొడుతోంది. పోయినప్పుడు ఎన్ని ఆపసోపాలు పడ్డా.. ఎంత తాపత్రయపడ్డా.. బాధితునికి మాత్రం పోలీసులు నిరాశే మిగిల్చారు. ఇప్పుడు ఆ బైకు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. వారు పట్టించుకోవట్లేదు. దొంగిలించిన వాళ్లు దర్జాగా తిరుగుతుంటే.. ఇష్టంగా కొనుక్కున్న తనకు బైక్​ సొంతం కాకుండా పోతోందని ఆవేదన చెందుతున్నాడు.

bike-challans
bike-challans

నేర సంఘటనల్లో ఆధారాలు.. నేరస్థులు ఉపయోగించిన సిమ్‌కార్డులు.. సీసీ కెమెరాల ఫుటేజీలుంటేనే కొందరు పోలీసులు పరిశోధిస్తున్నారు. ఈ ఆధారాలు లేకపోతే కేసులు నమోదు చేసినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆధారాలు ఉన్నా.. అదేంటో.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 9 ఏళ్ల క్రితం తన బైక్‌ దొంగిలించారంటూ బాధితుడు ఫిర్యాదు చేస్తే.. సాక్ష్యాధారాలు లేవంటూ పోలీసులు చేతులెత్తేశారు. ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోవటంతో తన బైక్​ పోయిందని.. ఇక దొరకదని బాధితుడు నిశ్చయించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు.. చోరీకి గురైన బైక్​కు సంబంధించిన చలానాలు వరుసగా వస్తోంటే.. ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. మళ్లీ తన బైక్​ దొరకుతుందని ఆశ చిగురించింది. అదే ఆశతో పోలీసుల దగ్గరికి వెళ్లిన బాధితునికి మాత్రం.. ఆనాటి నిర్లక్ష్యమే మళ్లీ ఎదురైంది.

సీసీ కెమెరాల్లో దొంగిలించిన బైక్​పై గుర్తుతెలియని వ్యక్తులు

ప్రాధేయపడినా ఫలితం శూన్యం...

హైదరాబాద్​ రామంతాపూర్‌లో నివాసమున్న మాటూరి వికాస్‌రెడ్డి.. పదేళ్ల క్రితం తన స్నేహితుడు అక్కపల్లి శ్రీనివాస్‌ పేరుతో బైక్‌ కొన్నాడు. అనంతరం వికాస్‌రెడ్డి తన కుటుంబంతో సహా మలక్‌పేటకు మారాడు. ఏడాది తర్వాత తన సోదరుడికి ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు రావడంతో రాకపోకలు వీలుంటుందని వికాస్‌రెడ్డి బైక్‌ను తన సోదరుడికి ఇచ్చేశాడు. కాలేజ్‌కి వెళ్లిన సోదరుడు.. మరుసటి రోజు ఉదయాన్నే క్లాస్​కు వెళ్లాల్సి ఉండడంతో రాజీవ్‌గృహకల్పలో ఉంటున్న తన స్నేహితుల గదిలో ఉన్నాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. వికాస్‌రెడ్డి ఘట్‌కేసర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. వారం పదిరోజులు హడావుడి చేసిన పోలీసులు తర్వాత వదిలేశారు. అప్పటి నుంచి పోలీసులను ప్రాధేయపడుతున్న వికాస్​రెడ్డికి.. ఈనాటికీ ఫలితం ఏమాత్రం కన్పించలేదు.

25న వచ్చిన చలానా

వరుసగా చలానాలు వచ్చినా.. మారని వరస...

పోలీసుల వైఖరితో బైక్‌ ఇక దొరకదు అని గట్టిగా నిర్ణయించుకున్న వికాస్‌రెడ్డికి.. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పంపించిన ఈ-చలాన్‌ చూసి ఆశ్చర్యం కలిగింది. 8 నెలల క్రితం మొదటిసారి ఈ చలాన్​ వచ్చింది. అప్పుడెప్పుడో చోరీకి గురైన బైక్‌ (ఏపీ11ఎజే6972)పై ఇద్దరు యువకులు శిరస్త్రాణం ధరించకుండా వెళ్తుంటే సీసీ కెమెరా ఫొటో తీసింది. ఆ చలానా తర్వాత మరో రెండు చలానాలు వచ్చాయి. ఈ విషయాన్ని వికాస్‌రెడ్డి వెంటనే.. ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అది దొంగిలించిన వాహనంగా గుర్తించారు.

డిసెంబర్​లో వికాస్​రెడ్డికి వచ్చిన చలానా

వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి... "చోరీకి గురైన తన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వినియోగిస్తున్నారని... వాళ్లు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల నాకు ఈ- చలాన్‌ వచ్చింది"అంటూ బాధితుడు వివరించాడు. ఎంతో ఆశతో వెళగా.. పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా మూడు రోజుల క్రితం శిరస్త్రాణం ధరించలేదంటూ.. మరో చలానా జారీ అయ్యింది. మళ్లీ పోలీసులను ఆశ్రయించి విషయం వివరిస్తే.. చూస్తాం.. చేస్తాం అంటూ ముక్తసరిగా సమాధానమిస్తున్నారు. ఉల్లంఘనల ప్రాంతాల ఆధారంగా తన బైక్‌ ఎక్కడ తిరుగుతుందో పట్టుకోండంటూ అభ్యర్థించినా.. ఫలితం మాత్రం కనిపించలేదు.

వాటిపైనే ఆసక్తా...?

మంత్రి కేటీఆర్​కు వికాస్​రెడ్డి ట్వీట్​

కళ్ల ముందు తన బైక్​ కనిపిస్తున్నా.. అందని చందమామే అవుతోందని భావించిన బాధితుడు.. ఉన్న కాస్త అవకాశాన్ని జారవిడుచుకోవద్దనుకుని ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ పోలీసులకు ట్వీట్‌ చేశాడు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఆ బైక్​ ఎవరిదో వారికి చలానాలు వేసేందుకు ఆసక్తి చూపించే పోలీసులు.. ద్విచక్రవాహనం పోయిందని ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టుకుని యజమానులకు అప్పగించేందుకు మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు ఆవేదనతో ప్రశ్నిస్తున్నాడు.

ఇదీ చూడండి:

Steel plant protest: కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల హెచ్చరిక..!

ABOUT THE AUTHOR

...view details