శిల్పాచౌదరిపై ఆదివారం మరో కేసు (Shilpa Chowdary Case Update) నమోదైంది. తన దగ్గర రూ.2.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని శిల్పపై ప్రియ తెలంగాణలోని నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేసింది. పిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బును శిల్పాచౌదరికి ఇచ్చానని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ ఆశతో శిల్పకు డబ్బు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. గత రెండేళ్లుగా వడ్డీ కూడా చెల్లించలేదని ప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితులు ఇంకెందరో..
టాలీవుడ్ ప్రముఖుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు శిల్పాచౌదరి బాధితుల జాబితాలో ఉన్నారు. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు ప్రముఖులను బుట్టలో వేసుకొని రూ.కోట్లలో బురిడీ కొట్టించారా కిలాడీ దంపతులు. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలిస్తామంటూ ప్రముఖుల నుంచి భారీగా వసూలు చేశారు. అడిగేందుకు వెళితే బెదిరింపులకు దిగారు. ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరి మరో మాయనాటకం వెలుగుచూసింది.
ఆర్భాటాల కోటకట్టి.. రూ.కోట్లు మూటగట్టి!
రంగారెడ్డి జిల్లా గండిపేట సిగ్నేచర్ విల్లాస్లో జెల్లా శిల్ప అలియాస్ శిల్పాచౌదరి, కృష్ణశ్రీనివాసప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. సినిమా నిర్మాణం, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామంటూ ఆమె ప్రచారం చేసుకునేది. దంపతులిద్దరూ కలిసి తాజాగా సహేరి సినిమా తీశారు. వివాదాల్లో ఉండటంతో విడుదల కాలేదు. తమ హంగూ ఆర్భాటాలతో నగరంలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. ఆమె ఉచ్చులో చిక్కిన మహిళలకు లాభాల ఆశచూపి భారీగా డబ్బు వసూలు చేసింది.