ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anantapur Accident News:పెళ్లి కుమార్తె కాళ్లపారాణి ఆరకముందే..

By

Published : Feb 7, 2022, 8:09 AM IST

Updated : Feb 7, 2022, 8:31 AM IST

Anantapur Accident News: విషాద వార్త విన్న పచ్చటి తోరణాలు.. వాడిపోయాయి. అప్పటి దాకా మోగిన బాజాభజంత్రీలు.. ఒక్కసారిగా ముగబోయాయి. ఆనందంతో సాగిన చిందులు.. ఆగిపోయాయి. మోముల్లో చిరునవ్వు చెదిరిపోయింది. పెళ్లి ముగించుకుని మొదలైన తిరుగు ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లి కుమార్తె కాళ్లపారాణి ఆరకముందే.. తండ్రి లేడన్న విషయం కన్నీటి సుడులు నింపింది. ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబాల్లో ఆర్తనాదాలు మిన్నంటాయి.

Anantapur Accident
Anantapur Accident

Anantapur Accident News: ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఇన్నోవాను లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో పెళ్లి కుమార్తె తండ్రి సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఉరవకొండ తాలూకా నింబగల్లు గ్రామానికి చెందిన కోక వెంకటప్పనాయుడు (రాష్ట్ర భాజపా రైతు మోర్చా కార్యదర్శి) కుమార్తె డాక్టర్‌ ప్రశాంతి బళ్లారిలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ప్రస్తుతం బెళగావి వైద్య కళాశాల్లో పీజీ పెథాలాజీ చేస్తున్నారు. వరుడు డాక్టర్‌ రాహుల్‌ది దావణగెరె నగరం. ప్రస్తుతం ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా తుమకూరు సిద్దగంగా వైద్య కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కోక వెంకటప్పనాయుడుకు బళ్లారి జిల్లాతో మంచి సంబంధాలు ఉండటంతో ఎక్కువ మంది బంధువులు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బళ్లారి నగరంలో పెళ్లి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని భావించారు. ఆదివారం ఉదయం పెళ్లి చేశారు. పెళ్లికుమార్తె తండ్రి కోక వెంకటప్పనాయుడు, మరికొంతమంది బంధువులు కారులో సొంతూరు నింబగల్లుకు తిరిగింపులు కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని బళ్లారి నుంచి బయల్దేరారు. కారును బళ్లారి నుంచి వెంకటప్పనాయుడే నడిపారు. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి- కొట్టాలపల్లి మధ్య అనంతపురం నుంచి బళ్లారి వెళ్తున్న లారీ ఇన్నోవాను వేగంగా ఢీకొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు.

విడదీయలేనంతగా అతుక్కపోయిన మృతదేహాలు..

ఎదురుగా వస్తున్న లారీ అత్యంత బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారి మృతదేహాలు మొత్తం విడదీయలేనంతగా అతుక్కపోయాయి. దృశ్యాలను చూసిన స్థానికులు దగ్గరకు వెళ్లడానికి భయపడే పరిస్థితి. ఉరవకొండ సీఐ శేఖర్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు వెంకటస్వామి, గోపాలుడు, వలీబాషా ప్రత్యేక బృందంగా ఏర్పడి మృతదేహాలను బయటకు తీశారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చి..

రాధమ్మది కణేకల్లు మండలం హనుమాపురం. భర్త రాజేంద్రప్రసాద్‌తో హైదరాబాద్‌లో ఉంటున్నారు. పెళ్లికోసం రెండు రోజుల కిందట భర్తతో కలిసి ఉరవకొండ వచ్చారు. భర్త వేరే వాహనంలో వెళ్లారు.

ఎమ్మెల్యే పరామర్శ

ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైద్య సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి పోస్టుమార్టం త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప, గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణాధికారిగా డీఎస్పీని నియమించారు.

తోడబుట్టిన వారు తోడుగానే..

బ్రహ్మసముద్రం మండలంలోని రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన సుభద్రమ్మ, పిల్లలపల్లి గ్రామానికి చెందిన శివమ్మ, బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి అక్కాచెల్లెళ్లు. వీరి చిన్న చెల్లెలు దాక్షాయనిది నింబగల్లు. దాక్షాయని కుమార్తె వివాహానికి వీరు శుక్రవారం బయల్దేరారు.

రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన సుభద్రమ్మ(65) కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. భర్త తిమ్మప్ప ఏడాది కిందట కరోనాతో మృతిచెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సతీష్‌ జర్మనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి. సుభద్రమ్మ గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె మృతితో రాయలప్పదొడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బ్రహ్మసముద్రం మండలంలోని పిల్లలపల్లి గ్రామానికి చెందిన శివమ్మ(58)ది వ్యవసాయ కుటుంబం. శివమ్మ భర్త రామాంజనప్ప 8నెలల కిందట కరోనాతో మృతిచెందాడు. శివమ్మకు సునీల్, రవి ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీల్‌ ఉపాధ్యాయుడు. రవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రోదిస్తున్న బంధువులు

బొమ్మనహాళ్‌కు చెందిన తిరువీదుల సరస్వతి(60), అశోక్‌(38) తల్లీకొడుకులు. అశోక్‌కు వివాహం కాలేదు. ఈయన బళ్లారిలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. సరస్వతి కుమార్తె స్వాతి(30)ని ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె కూతురు జాహ్నవి(12), కుమారుడు జశ్వంత్‌(12) కూడా ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో తల్లీ, కుమారుడు, కుమార్తె, మనుమడు, మనుమరాలు మృతి చెందడంతో రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:Anantapur Accident News: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 9 మంది దుర్మరణం

Last Updated : Feb 7, 2022, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details