అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఏకశిలా నంది విగ్రహం వద్ద కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సామూహిక యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుగొండ ఆర్డీవో మధుసూదన్.. జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో సభ్యులను ఆసనాలు చేసేందుకు అనుమతించారు. యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని.. యోగాను విధిగా చేయాలని ఆర్డీవో మధుసూదన్ సూచించారు. కార్యక్రమంలో లేపాక్షి మండల ప్రముఖులతోపాటు, మండల తహసీల్దార్, పురావస్తుశాఖ అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో..
తిరుపతి నగరపాలక సంస్థ, చిత్తూరు జిల్లా యోగా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ప్రకాశంపార్క్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీషా, కమిషనర్ గిరీషా పాల్గొని యోగాసనాలు వేశారు. అనారోగ్య సమస్యలకు యోగా మాత్రమే పరిష్కారమని మేయర్ శిరీషా అభిప్రాయపడ్డారు.
విశాఖ జిల్లాలో..
ఆంధ్ర వర్సటీలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పతంజలి విగ్రహానికి పలువురు పూలమాలు వేశారు. అనంతరం యోగా నిపుణులు.. ప్రత్యేక యోగా వెబ్నార్ నిర్వహించారు. స్థానిక విద్యార్థులతోపాటు విదేశాల్లోని వారు సైతం వెబ్నార్ ద్వారా జరిగే యోగా శిబిరంలో పాల్గొన్నారు.
పాడేరు కుమ్మరి పుట్టు కొవిడ్ క్వారంటైన్ సెంటర్లో కరోనా బాధితులతో యోగ చేయించారు. ప్రాణాయామం, ఉపయోగాలు, చేసే విధానాన్ని వివరించారు. పది రోజులుగా పాడేరు క్వారంటైన్ సెంటర్లో యోగపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని సహాయ సంక్షేమ అధికారిణి రజిని సూచించారు.
చోడవరంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పతంజలి చిత్ర పటానికి పూలమాలు వేశారు. ఆనంతరం కేంద్ర ఆయూష్ శాఖ నిర్వహించిన ఆన్ లైన్ అంతర్జాతీయ యోగా పోటీలలో రాష్ట్రం తరుపున ఉత్తమ ప్రతిభ కనబరిచిన గొంతిన లయవర్ధన్(08), పందిరి వెన్నల శ్రీ, యోగా గురువు పుల్లేటి సతీశ్ను సత్కరించారు. తనకు కరోనా సోకినా... యోగా సాధనతో ఆరోగ్యంగా బయటపడినట్లు గోవాడ చక్కెర కర్మాగారం పరిపాలనాధికారి పప్పల వెంకట రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో
ఆత్మకూరు కొవిడ్ కేర్ సెంటర్లో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, యోగా గురువు ఖాసీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా తరగతులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఉద్యోగిగా ఉన్న ఖాసీం.. ప్రత్యేక యోగా శిక్షకుడిగా ఉండడం ఎంతో సంతోషమన్న మున్సిపల్ కమిషనర్.. యోగా గురువు ఖాసీంను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాని ఎస్ఆర్జేడీ డిగ్రీ కాలేజ్ వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఇదీ చదవండి..
job calendar: విజయనగరం కలెక్టరేట్ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు