ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 28, 2020, 9:54 AM IST

ETV Bharat / city

వెలుగులోకి దొంగ రిజిస్ట్రేషన్లు.. వంద వరకు గుర్తింపు

మీ కళ్లెదుటే మీ ఆస్తి ఉన్నా... మీకు తెలియకుండానే వేరొకరి చేతుల్లోకి చేరిపోవచ్చు! మరొకరి పేరున మారిపోవచ్చు! మీరసలు బతికే లేరని దస్త్రాలు బయటకు రావొచ్చు. అసలు అది మీ ఆస్తే కాదని నమ్మించొచ్చు!... ఏంటీ నమ్మకం కలగడం లేదా! ఇవన్నీ ఇటీవల వెలుగు చూసిన నిజాలే! అధికారులు సైతం విస్తుపోతూ నిందితుల కుట్రలను బయటకు లాగుతున్నారు.

wrong-registrations
wrong-registrations

నాలుగు వారాలుగా ప్రతి మంగళవారం విశాఖ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకరణలో దొంగ(ఫ్రాడ్‌) రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటివరకు 100 అక్రమ రిజిస్ట్రేషన్లను గుర్తించారు. ఇవన్నీ 2018కి ముందు జరిగినవే. భీమిలి, గాజువాక, ఆనందపురం, గోపాలపట్నం, పెదగంట్యాడ, పెందుర్తి, మధురవాడ నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.

*గోపాలపట్నం యల్లపువానిపాలెంలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి ఏకంగా దొంగ రిజిస్ట్రేషన్‌ చేసేశారు. అంతే కాదు ఆధీనంలోకి తీసుకొని సొంతానికి వినియోగించుకుంటున్నట్లు బాధితుల నుంచి ఫిర్యాదు అందింది.

*వేపగుంటకు చెందిన ఓ మహిళ పదేళ్ల కిందట బక్కన్నపాలెంలో కొంత స్థలం కొనుగోలు చేశారు. అమ్మకందారులు ఆమెకు స్థలం చూపిన తరువాత...తప్పుడు సర్వే నంబరుతో తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇప్పుడు స్థలం ఎక్కడ కొనుగోలు చేశారో ఆమెకే తెలియకుండా పోయింది.

*తప్పుడు పత్రాలతో తన ఆస్తి వేరొకరి పేరు మీద మారిపోయినట్లు గుర్తించిన చినముషిడివాడకు చెందిన వ్యక్తి గత నెలలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో 1969లోని డాక్యుమెంటుకు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసేశారు.

*నరవ గ్రామంలో దంపతులకున్న ఆస్తిపై ఇద్దరు వ్యక్తులు కన్నేశారు. ఆ దంపతులు చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు తయారీకి, ఫోర్జరీ సంతకాలకూ వెనుకాడలేదు. అలా 300 గజాల స్థలాన్ని కొట్టేశారు. ఈసీ తనిఖీలో ఈ విషయం తెలుసుకున్న బాధితులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదించడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అరెస్టు చేశారు.

*గాజువాక వడ్లపూడికి చెందిన వ్యక్తికి 50 సెంట్లుంటే జాతీయ రహదారి పనుల్లో 20 సెంట్ల భూమి పోయింది. మిగిలిన భూమి అతని పేరున లేకుండా మరొకరి పేరున రిజిస్ట్రేషన్‌ కావడంతో కంగుతిన్నారు.

*ద్వారకానగర్‌కు చెందిన ఒక వ్యకి ఆస్తిని తప్పుడు పత్రాలతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించిన విషయం బయటకొచ్చింది.

కళ్లుగప్పి:రిజిస్ట్రేషన్‌ శాఖలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని కొందరు తెగిస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ...అసలైన వ్యక్తులకు బదులు ఇతరులను చూపించి రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. వెలుగు చూసిన మోసాల్లో 2018కి ముందు జరిగినవే ఎక్కువగా ఉన్నాయి.

తాఖీదులిస్తూ...విచారిస్తూ:దొంగ రిజిస్ట్రేషన్ల విషయంలో బాధితులతో పాటు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పిలిపించి వారి వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయో అధికారులు తెలుసుకుంటున్నారు. ముందుగా సమయం తెలిపి.. హాజరు కావాలని సూచించి విచారిస్తున్నారు. అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తీవ్రంగా ఫోర్జరీ, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై పోలీసు కేసు నమోదు చేసేలా సిఫార్సు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం పలువురికి నోటీసులు జారీ చేసింది.

ఈసీ తప్పనిసరి: ఎవరికైనా స్థలం అమ్మాలన్నా, విక్రయించాలన్నా ఈసీ (ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌) తనిఖీ చేయాల్సిందే. తప్పుడు రిజిస్ట్రేషన్ల నివారణకు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈసీ పరిశీలనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అమ్ముతున్న వారి ఈసీ పరిశీలించడంతో పాటు రిజిస్ట్రేషన్‌ తరువాతా ఈసీ తీసుకోవాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు.

ప్రత్యేక బృందంతో..

ఇటీవల వరుసగా జరుగుతున్న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో తప్పుడు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. డాక్యుమెంట్లను పరిశీలించి అందులో ప్రభుత్వ భూమి ఉంటే కలెక్టరుకు రాసి స్వాధీనం చేసుకునేలా చేస్తున్నాం. ప్రైవేటువైతే ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చి పిలిపిస్తున్నాం. మోసాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఈ ప్రక్రియలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా సమస్య కొలిక్కితెస్తాం.- కె.మన్మథరావు, జిల్లా రిజిస్ట్రార్‌

ఇదీ చదవండి:'డిసెంబరు 31లోగా నివర్ నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం'

ABOUT THE AUTHOR

...view details