దేశంలో వివిధ ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రతి 20 మంది కరోనా రోగుల్లో కనీసం ముగ్గురికి ప్రాణవాయువు అందించి చికిత్స చేయడం అనివార్యంగా మారింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న సమయంలో సిబ్బంది ఆందోళనలకు స్వస్తి చెప్పి ప్రాణ వాయువు అందించడానికి చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. దేశంలో పడకల సంఖ్య, మందుల సమస్య కన్న తీవ్రంగా నెలకొన్న ప్రాణవాయువు కొరత రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రాణ వాయువు నిల్వలు చాలినంతగా లేని ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. ప్రాణ వాయువు నిల్వల కోసం ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్రానికి ఒక ఆశాజనకమైంది.
స్టీల్ ప్లాంట్లో ఉక్కు ఉత్పత్తి అవసరాలకు ఆక్సిజన్ భారీ మొత్తంలో కావల్సి ఉంటుంది. ఆయా స్టీల్ ప్లాంట్లలో చేసిన ఉత్పత్తిలో మొత్తాన్ని స్టీల్ పరిశ్రమ అవసరాలకే అధికంగా వినియోగిస్తారు. ప్రస్తుత దేశ అవసరాల దృష్ట్యా విశాఖపట్నం, సెయిల్, టాటాస్టీల్, జేఎస్డబ్ల్యూ వంటి సంస్థలు ఆక్సిజన్ ఉత్పతిని పెంచాయి. పరిశ్రమలు తయారు చేసే పారిశ్రామిక ఆక్సిజన్లో 90- 95 శాతం నాణ్యత ఉంటుంది. ఇందులో కొన్ని మలినాలు ఉంటాయి. వాటిని పూర్తిగా తీసి వేసి పూర్తి నాణ్యంగా తయారు చేస్తేనే ఆసుపత్రులలో ప్రాణం కోసం కొట్టుమిట్టాడే రోగులకు ప్రాణవాయువు వినియోగించే అవకాశం ఉంటుంది. ప్రాణవాయవు లేకుండా మందులు ఇతర చికిత్స విధానాలు కొవిడ్ రోగుల ప్రాణాలను నిలబెట్టలేవు.
ఇదీ చదవండి: ప్రైవేటు ఆస్పత్రులకు అందని ఆక్సిజన్- ఎంపీ ఫిర్యాదు