విశాఖలో సంచలనం స్పష్టించిన ఘరానా కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తే లక్ష్యంగా ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్కు పథకాన్ని రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పల్లపు ప్రసాద్, పరపతి రామ్ రెడ్డిని అరెస్టు చేశారు. కేసు వివరాలను విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు.
ఇదీ జరిగింది...
విశాఖలో నిత్యం రద్దీతో ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్- రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో ఈ నెల 5న ఓ ఘరానా కిడ్నాప్ జరిగింది. డీఆర్ఎం కార్యాలయం వద్ద ఉన్న సురేశ్ కుమార్ అనే వ్యక్తిని కత్తులు, తుపాకీ చూపించి దుండగులు అపహరించారు. అక్కడి నుంచి పరవాడ ప్రాంతంలోని ఓ విల్లాకు తీసుకువెళ్లారు. కిడ్నాప్నకు గురైన వ్యక్తిని తీవ్రంగా బెదిరించి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద అంత సొమ్ము లేదని చెప్పిన సురేశ్... 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు.
అయితే ఆ డబ్బును కూడా తన భార్య బంగారం తాకట్టు పెట్టి ఇవ్వగలనని చెప్పాడు. సరేనన్న కిడ్నాపర్లు సురేశ్ను తీసుకుని విశాఖ నగరంలోని ద్వారకానగర్ ఐఐఎఫ్ఎల్ వద్దకు చేరుకున్నారు. ఐఐఎఫ్ఎల్లో బంగారం తాకట్టు పెట్టి నిందితులకు డబ్బు ఇవ్వాలని సురేశ్ భావించారు. ముందుగా సమాచారం ఇవ్వటంతో అతని భార్య బంగారం తీసుకుని కుమారుడితో పాటు అక్కడికి చేరుకున్నారు. సురేశ్ పైనా గతంలో కొన్ని కేసులు ఉండటంతో ఈ డబ్బును కావాలని దుబారా చేస్తున్నాడేమో అని భావించిన భార్య.. అతనితో గొడవకు దిగింది.